రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాముడెవరో.. రాక్షసుడెవరో ఎన్నికలప్పుడు తేల్చుకుందామని, ఇప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిలో తమతో కలిసి రావాలని ప్రతిపక్షాలకు ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు. కరోనా విషమ పరిస్థితిలో రాష్ర్టానికి రూ.లక్ష కోట్ల నష్టం జరిగినా ప్రధాని మోదీ నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. సాగును సంబురం చేస్తూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే, మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం మన మెడమీద కత్తిపెట్టినా రాష్ట్రంలో సంక్షేమం ఆగలేదని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా చీర్లవంచ, మండెపల్లి, గండిలచ్చపేట, దుమాల గ్రామాల్లో ఏర్పాటుచేసిన సభల్లో మంత్రి మాట్లాడారు. రైతుబంధు ద్వారా 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు పెట్టుబడి సాయం అందించామని చెప్పారు. ‘12,769 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు ఏర్పాటుచేశాం.
పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు నిధులు వరదలా వచ్చాయి. దేశంలోనే అత్యుత్తమ, ఆదర్శ గ్రామాలకు నెలవు తెలంగాణే అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా గుర్తించి అవార్డులు ఇచ్చింది. 75 ఏండ్లలో జరగని అభివృద్ధి ఎనిమిదేండ్లలో చేసి చూపాం. ఇది కండ్లముందు కనిపించడం లేదా?’ అని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. నాయకుడికి ఖలేజా, గుండెనిండా సాహసం ఉంటే దళితబంధులాంటి అద్భుత కార్యక్రమాలు చేపడుతారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ఆలోచన చేయాలంటే సీఎం కేసీఆర్కే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులుంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయని తెలిపారు. నిత్యం తిట్టిపోసే ప్రతిపక్షాలకు సైతం ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. ‘మసీదులు కూల్చడం, మత కలహాలు సృష్టించడం, పేపర్లు లీక్ చేయడం తప్ప బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ జిల్లాకు చేసిందేమిటి? ఎంపీగా బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించి ఉంటే జిల్లాకు రైలుమార్గం త్వరగా వచ్చేది’ అని తెలిపారు. మధ్య మానేరు జలాశయం వద్ద 350 ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న ఆక్వా హబ్ పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని, 18 ఏండ్లు నిండిన యువతకు పరిహారం వచ్చేలా చూస్తానని మధ్యమానేరు ముంపు నిర్వాసిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.
సాగుకు సకల వసతులు
సమైక్య రాష్ట్రంలో కరెంటు డిమాండ్ 13,117 మెగావాట్లు ఉంటే, స్వరాష్ట్రంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ దాటిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. కరెంటు కోసం రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. 50 వేల కోట్లు ఖర్చుచేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ పాలనలో కరెంటు, నీళ్లు, పెట్టుబడి సాయం అందించడం వల్లే భూముల ధరలు బాగా పెరిగాయని పేర్కొన్నారు. ‘గల్ఫ్లోని క్యాంపులను నేను స్వయంగా సందర్శించి మీరు పడ్డ కష్టాలను చూశాను’ అని దుమాల గ్రామ ప్రజలతో తన అనుభవాలను నెమరు వేసుకొన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ నిర్ణయంవల్ల 3 వేల మంది గిరిజనులు సర్పంచ్లుగా, 20 వేల మందిని వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అంధత్వాన్ని నివారించాలన్న లక్ష్యంతో కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద స్థలం ఉన్న పేదలందరికీ ఇల్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. చీర్లవంచ గ్రామానికి రూ. పదికోట్లతో డబుల్ రోడ్డు వేయిస్తానని, గోపాల్రావుపల్ల్లి, చింతలఠాణ, చీర్లవంచ గ్రామాల పిల్లలకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, తెలంగాణ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ నేతలు గడ్డం నర్సయ్య, తోట ఆగయ్య, జిందం చక్రపాణి, చీటి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
దళితబంధుతో అనూహ్య మార్పులు
సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. దళితబంధు పథకంతో పేద దళిత కుటుంబాల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయని తెలిపారు. ఈ పథకం కింద వచ్చిన డబ్బుతో రైస్ మిల్లులు, కోళ్ల ఫాంలు, సూపర్ మార్కెట్లు, ఇటుకల తయారీ లాంటి కుటీర పరిశ్రమలు పెట్టుకొని ఆర్థికంగా దళిత కుటుంబాలు ఎదుగుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 40 వేల మందికి ఈ పథకం వర్తింపజేసినట్టు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అద్భుత అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు చేయలేదో ప్రజలు ఆలోచించాలని కోరారు. ‘నాడు కరెంటు ఉంటే వార్త. నేడు కరెంటు పోతే వార్త. సాగునీటి కష్టాలు, తాగునీటి కోసం బిందెలు పట్టుకొని మహిళలు రోడ్డెక్కడం తెలంగాణలో ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైంది’ అని చెప్పారు. మన పైసలు మనం ఖర్చు పెట్టుకొంటున్నందునే రాష్ట్రంలో వ్యవసాయం, కరెంటు, గ్రామాలు బాగుపడుతున్నాయని తెలిపారు. ‘సమైక్య పాలనలో కిస్తీలు కట్టకుంటే అంజుమన్ బ్యాంకోళ్లు తలుపులు, దర్వాజాలు ఎత్తుకెళ్లేవారు. తెలంగాణలో ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? రైతుకు పెట్టుబడి సాయం ఉల్టా ఇచ్చిన సర్కారు దేశంలో ఎక్కడైనా ఉన్నదా?’ అని ప్రశ్నించారు.
రోజంతా బిజీబిజీ
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ రోజంతా బిజీబిజీగా గడిపారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో 32/11కేవీ సబ్స్టేషన్ ప్రారంభించి ఎస్సీ, ముదిరాజ్ కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. పాపయ్యపల్లెలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, గోపాల్రావుపల్లెలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫిజియోథెరపీ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించి, మండెపల్లి గ్రామానికి చేరుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గండిలచ్చపేట గ్రామంలో దళితబంధు పథకం కింద ఏర్పాటు చేసిన పౌల్ట్రీఫాంను ప్రారంభించారు. అదే గ్రామంలో అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం 34 మంది దళితబంధు లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసి, చిట్టివాగుపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. అక్కపల్లి బుగ్గరాజేశ్వర తండాలో గ్రామ పంచాయతీ భవనం, ఎస్టీ కమ్యూనిటీ హాలును ప్రారంభించారు. రాచర్ల గుండారం, గంభీరావుపేట మండలంలోని గోరంటాలలో అంబేద్కర్ విగ్రహాలను
ఆవిష్కరించారు.