రాజన్న సిరిసిల్ల : శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులు.. సాధికారత, స్వావలంబన సాధించేందు కోసం దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందనీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం, పదిరకు చెందిన ముగ్గురు దళిత బంధు లబ్ధిదారులు అక్కపల్లి శివారులో నిర్మించుకోనున్న నాలుగు టన్నుల సామర్థ్యం గల రా రైస్ మిల్లు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమో, ఓట్ల కోసమో ఈ పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. సీఎం కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా… దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కూలీల నుంచి ఓనర్లుగా, సక్సెస్ పుల్ వ్యాపార వేత్తలుగా ఎదగాలనీ మంత్రి ఆకాంక్షించారు.
అరవై ఏండ్లుగా దళితుల కోసం అనేక పథకాలు అమలైనప్పటికీ సమాజంలో అత్యధిక మంది దళితులు అట్టడుగునే ఉన్నారని మంత్రి అన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీలు లేకుండానే నేరుగా లబ్ధిదారులకు రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేసే పథకం దేశంలోనే మరెక్కడా లేదని తెలిపారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి వ్యాపార నిర్వహణను సొంతంగా చూసుకోవాలని మంత్రి అన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని సెస్ కార్యాలయంలో సెస్ నూతన పాలకవర్గం పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సెస్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ , సభ్యులు పదవీ బాధ్యతల స్వీకరించారు. మంత్రి కేటీఆర్, సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్ పర్సన్ ఎన్ అరుణ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.