హైదరాబాద్: దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉంది, హైదరాబాద్కు మాత్రమే ఎన్నో కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ ప్రాజెక్టునైనా వచ్చే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మణికొండ అల్కాపురి టౌన్షిప్లో ఓఆర్ఆర్ ఫేజ్-2 నీటి సరఫరా పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. నగరం చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు ఇప్పటికే హైదరాబాద్తో కలిసిపోయాయని చెప్పారు. కార్పొరేషన్లో విలీనమైన అన్ని గ్రామాలకు నీరు అందిస్తామని వెల్లడించారు. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలను హైదరాబాద్లో భాగంగా భావిస్తున్నామన్నారు.
ఓఆర్ఆర్ పరిధి ఆవాసాలకు రూ.1200 కోట్ల వ్యయంతో నీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఇందులో హైదరాబాద్ శివారు ప్రాంతాలకే రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. కాళేశ్వర ప్రాజెక్టు రిజర్వాయర్ల నుంచి తాగునీరు కూడా సరఫరా చేస్తామని తెలిపారు. కొండ పోచమ్మసాగర్ నీటితో గండిపేట చెరువును నింపాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు.
తెలంగాణ పథకాలే దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని చెప్పారు. రైతుబంధుని మనం ప్రారంభించిన తర్వాత దేశంలోని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని వెల్లడించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా విద్యుత్ సమస్యను పరిష్కరించామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని స్పష్టం చేశారు.
గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలకు వెళ్తే ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారని, ఎండాకాలం వచ్చిందంటే జలమండలి ఆఫీస్ ఎదుట మహిళలు ధర్నాలకు దిగేవారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని తెలిపారు.