Minister KTR | దళితబంధు పథకంలో రైస్మిల్ను ఏర్పాటు చేసుకొని.. పలువురికి ఉపాధి కల్పించడాన్ని చూస్తే గుండె సంతోషంతో నిండిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కేసీఆర్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఉద్యమం సమయంలో అన్నం తిన్నమో, అటుకులు బుక్కినమో ఏం చేసినమో చేసినం గానీ.. మొత్తానికి అనుకున్న లక్ష్యం సాధించేదాక.. ఉద్యమ వ్యతిరేకులుగా ఉన్న కాంగ్రెస్, ఆనాడు ఉన్న పార్టీలకు వాటన్నింటికి పోరాటం చేసి ఫలితం సాధించామంటే దానికి ప్రధాన కారణం దానికి గులాబీ దండు కమిట్మెంట్ అని కేసీఆర్ చెబుతారు. ఆ స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించినందుకు ధన్యవాదాలు’ తెలిపారు.
‘ఇక్కడికి వచ్చే ముందు సంతోషం అనుభవించే సందర్భం ఎదురైంది. కుంభాల మల్లారెడ్డి ఒక మంచి పని చేసి వాళ్ల ఊరికి పిలిచిండు. కేసీఆర్ దళితబంధు విప్లవాత్మకమైన పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్లు, హుజూరాబాద్ నియోజకవర్గానికి పైలెట్ నియోజకవర్గంగా 18వేల యూనిట్లు ప్రకటించి ఇప్పటికే దాదాపు 38వేల యూనిట్లు రూ.4వేలకోట్లు దళితబంధు కింద విడుదల చేశాం. సిరిసిల్లలో అమలు చేసే సమయంలో దళితబంధు అంటే కార్లు కొనుడు, టాక్సీలు నడుపుడు కాదు రూ.10లక్షల ఇస్తే వాటిని పదింతలు చేసే సత్తా మాకుందని చూపే సోదరులను పట్టుకోవాలని అనుకున్నాం.
ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో విజయ్కుమార్, డప్పుల లింగయ్య, సుదమల్ల రాజేశ్వరి రూ.30లక్షలతో బ్యాంకు లోను తీసుకొని.. ప్రభుత్వం ద్వారా సబ్సిడీలతో రూ.3కోట్లతో అద్భుతమైన రైస్మిల్ను కట్టి ఇవాళ నాతోని ప్రారంభింపజేశారు. సంతోషం ఎక్కడ అనిపించిందంటే ఆ రైస్ మిల్కు నేనే భూమిపూజ చేశాను. ఇవాళ ప్రారంభోత్సవం చేసే అదృష్టం, భాగ్యంనాకే దక్కింది. అక్కడకుపోయి చూసి కండ్లకు నీళ్లచ్చినయ్. గుండె సంతోషంతో నిండిపోయింది. ఎందుకంటే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు అంటే వారికి అయాచితంగా సాయం చేస్తున్నట్లు, చాతకాని వాళ్లకు ఉదారంగా ఇస్తున్నట్లు బిల్డప్లు ఇచ్చిన ప్రభుత్వాలను చూశాం. వాళ్లు కూడా సంపద సృష్టించి సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడి.. ఇతరులకు ఉపాధి కల్పించే సత్తా ఉన్నదని అక్కడకు పోయినప్పుడు గర్వంగా, గొప్పగా అనిపించింది’ అన్నారు.
‘రైస్మిల్ను ప్రారంభించే సమయంలో బిహార్ యువకుడు కనిపించాడు. ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగితే రైస్ మిల్ ప్రారంభంతో ఇక్కడకు 12 మంది బిహార్నుంచి వచ్చారని చెప్పాడు. 12 మంది బిహార్ నుంచి వచ్చి పని చేసుకుంటున్నాం. నేను ఆపరేటర్ పని చేసుకుంటున్న. నా కింద హమాలీలు, ఇతర సిబ్బంది 12 మంది పని చేస్తున్నారని ఆ తమ్ముడు చెబితే.. ఇవాళ తెలంగాణ.. రాష్ట్ర బిడ్డలకు బువ్వపెట్టుడు కాదు ఎక్కడో ఉండే.. ఉత్తరప్రదేశ్, బిహార్ బిడ్డలను కడుపులో పెట్టుకొని బువ్వపెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశానికి తొవ్వ చూపుతున్న రాష్ట్రం తెలంగాణ గర్వంగా అనిపించింది. ఇలాంటి ఉదాంతాలు చాలా అరుదుగా మనకు ఎదురుపడుతాయ్. దుమాల నుంచి వస్తున్న సమయంలో సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మార్గంలో వస్తున్న సమయంలో కలెక్టర్ చెప్పారు. పదిరలో ఇచ్చిన దళితబంధు ద్వారా 9 మంది ఒకే వద్దకు వచ్చి.. పథకం కింద రూ.90లక్షలతో పెట్రోల్ బంకు పెడుతున్నరు అని కలెక్టర్ చెపితే గుండె సంతోషంతో
ఉప్పొంగింది’ కేటీఆర్ తెలిపారు.
‘పదవులు మస్తుగ వస్తయ్. పోతయ్. నాకంటే ముందు ఎమ్మెల్యేలు ఉన్నరు. నా తర్వాత మస్త్ మంది ఎమ్మెల్యేలు ఉంటరు. భూమ్మీదకు శాశ్వతంగా ఉండేందుకు, వెయ్యేళ్లు రాజకీయం చేసేందుకు, 500-600 సంవత్సరాలు పదవుల్లో ఉండేందుకు ఎవరూ రాలే. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు మంత్రులు.. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. పదవులు
మస్త్గా వస్తయ్.. పోతయ్. కానీ, వెనక్కి మళ్లి చూస్తే పదవులు ఉన్నప్పుడు ఏం చేశావంటే.. వెనక్కి తిరిగి గల్లా ఎగురవేసి ఇగో ఇది నేను చేసిన అని చెప్పే సత్తా కేసీఆర్ నాయకత్వంలో పని చేసే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు మీకు మాత్రమే ఆ ఘనత ఉంటుంది.
మీ నాయకత్వంలో జరుగుతున్న మామూలు పనులు కావు. మనకు అర్థమవుతలేదు.
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉన్నది అంటే.. గంగదేవిపల్లి, ఓ అంకాపూర్ గ్రామం పేరు చెబుతుండే. కానీ ఇవాళ తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డులకు నేను సలామ్ కొడుతున్న. ఎందుకుంటే బ్రహ్మాండంగా పని చేస్తున్నరు. ఒకరితో ఒకరు పోటీపడి గంగదేవిపల్లి, అంకాపూర్ను మేం ఎందుకు సృష్టించొద్దని పోటీపడుతున్నరు. పంచాయతీ సెక్రెటరీల నుంచి జిల్లా అధికారుల వరకు అందరూ మీకు సహాయం అందిస్తున్నరు. ఈ పని ఎమ్మెల్యేలో, ఎవరో కొందరు అనుకుంటే కాదు. క్షేత్రస్థాయిలో మీరు అష్టకష్టాలు పడి పని చేస్తే అవార్డుల మీద అవార్డులు వస్తున్నయ్’ అంటూ అభినందించారు.
‘ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని సర్వే చేసినా.. అవార్డులు ప్రకటించాలని లెక్కలు తీస్తే 20లో 19 తెలంగాణవే ఉన్నయ్. ఇది మనకు గర్వకారణం కాదా? ఇది కాదా నాయకత్వ సమర్థత. ఇది కాదా? ఒక నాయకుడి దక్షతా. మన ముఖ్యమంత్రి కార్యదక్షతా. దేశంలో బెస్ట్ మున్సిపాలిటీలు ఎక్కడున్నయ్ అని లెక్క తీస్తే 142లో 27 మున్సిపాలిటీలకు అవార్డులు వచ్చాయి. ఇది సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి పనితీరు, ఫలితం కాదా? కౌన్సిలర్లు బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడనే కాదు రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా పనులు పట్టణ ప్రగతి పనులు జరుగుతున్నాయి. ఏ పల్లెకు పోయినా చక్కటి వాతావరణం.
బలగం సినిమా ఇంట్లో చూస్తుండగా.. ఇంట్లో ఇది నిజంగా సిరిసిల్లనేనా అని నన్ను అడిగారు. నీకెందుకు డౌటు వచ్చింది అంటే.. ఇంత పచ్చగుంటదా? మీ సిరిసిల్ల అన్నరు. మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం, ఆత్మహత్యలకు నిలయమైన సిరిసిల్ల కోనసీమను తలదన్నే అందాలతో సెల్యూలాయిడ్ మీద
బ్రహ్మండంగా కనిపిస్తుంటే మన గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోతలేవా. ఊరికి పోయినా ఓ నర్సరీ, డంప్ యార్డ్, స్వాగతం పలికే చెట్లు, ఇంటింటికీ నల్లా నీళ్లు, రైతు వేదికలు, రైతులకు గోదాములు కట్టింది నిజం కాదా. 70 ఏళ్లలో జరగని పనులు.. ఏడెనిమిది ఏళ్లలో జరిగిన మాట వాస్తవం కాదా? ఈ దేశంలో రాష్ట్రంలో? మెడమీద తలకాయ ఉన్నోడు ఎవడూ చెప్పడు. కాకపోతే దురదృష్టం ఏంటంటే.. ఈ మధ్య మెడమీద తలకాయ లేనెల్లే ఎక్కువయ్యారు దేశంలో’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.