Minister KTR | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎప్పటికైనా దేశానికి ప్రథమ శత్రువు బీజేపీయేనని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. మోదీ ముందు, బీజేపీ ముందు తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్వి దింపుడుకల్లం ఆశలు మాత్రమేనని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. కేటీఆర్ ఆదివారం ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గెలిచేది మేమే.. మా సీఎం అభ్యర్థి, సీఎం అయ్యేది ముమ్మాటికీ కేసీఆరే’ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్కు ప్రత్యామ్నాయమైన నాయకుడే లేరని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు సీట్లు పంచుకునేలోగా తాము స్వీట్లు పంచుకుంటామని తెలిపారు.
పథకాలను కాపీ కొట్టింది కాంగ్రెస్సే
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందనడం హాస్యాస్పదమని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలకే పేర్లు మార్చి కాంగ్రెస్ డిక్లరేషన్ పేరుతో ప్రకటించిందని పేర్కొన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ను కాదని, 3 గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్కు ఎవరైనా ఓటేస్తారా? అని ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని పార్టీ కాంగ్రెస్ అని, మ్యానిఫెస్టోలో లేని ఎన్నో పథకాలు తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. తాము బడ్జెట్ బేరీజు వేసుకుని హామీలు ఇస్తామని చెప్పారు. 2018లో రాహుల్గాంధీ స్వయంగా రాష్ర్టానికి వచ్చి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని, తాము మాత్రం రూ.లక్ష మాఫీ చేస్తామని చెప్పామని గుర్తు చేశారు. కర్ణాటకను చూస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థమవుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చుక్క మందుపోయకుండా, డబ్బులు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని రేవంత్రెడ్డి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం మొత్తం చూస్తుండగా డబ్బులు పంచిన వ్యక్తి, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 2018 ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాయం తీసుకుంటానని చెప్పి మాట తప్పిన సన్నాసి మాటలు ఎలా నమ్ముతామని పేర్కొన్నారు. 1989 నుంచి నేటి వరకు తెలంగాణలో ఎన్నడూ యాభై సీట్లు దాటి గెలవని విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్లేదని ‘కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు.. సచ్చేది లేదు’ అని తేల్చిచెప్పారు. నాడు డీఎస్ ఇంటికి తులం బంగారం పంచి.. ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు సిరిసిల్ల ప్రజలపై పూర్తి విశ్వాసం ఉన్నట్టు తెలిపారు. తనకంటే మెరుగైన అభ్యర్థి కనిపిస్తే.. ఆయననే గెలిపించమని తాను కోరుతానని చెబుతూ తన చిత్తశుద్ధిని ప్రకటించుకున్నారు.
పేదరికానికి బీజేపీనే కారణం
దేశంలో గుండు పిన్ను నుంచి గోల్డ్ కొనేవారి వరకూ అంతా ట్యాక్స్పేయర్సే అని కేటీఆర్ పేర్కొన్నారు. తాము మాత్రమే ట్యాక్స్ కడుతున్నామని, తమమీదే దేశం ఆధారపడి ఉందని కొందరు అనుకోవడం సరికాదని తెలిపారు. మనం చంద్రయాన్ను పంపినా.. ఇక్కడ తిండికోసం ఏడ్చే పేదలున్నారని పేర్కొన్నారు. ఇంత పేదలున్న దేశంలో పన్నెండున్నర లక్షల కోట్లను కార్పొరేట్లకు రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశంలో పేదరికానికి బీజేపీయే కారణమని ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్న పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. నిజామాబాద్ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ మరోసారి తిప్పికొట్టారు. తమ పార్టీకి 105 మంది ఎమ్మెల్యేలున్నారని, తనను సీఎం చేయాలనుకుంటే ఎమ్మెల్యే మద్దతు అవసరం. కానీ, ఆయనెవరని, ఆయన అనుమతి ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్రంలో ఔట్డేటెడ్ పార్టీ అని, ఇప్పుడు 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని తేల్చి చెప్పారు.
ప్రవళిక విషయంలో తప్పు చేస్తున్నారు
ప్రవళిక ఆత్మహత్య విషయంలో విపక్ష పార్టీలు, నేతలు అవగాహన లేకుండా ఆందోళనలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్లిన పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిడి ఉందని చె ప్పడం అబద్ధమని తెలిపారు. పరీక్ష ఎందుకు వాయి దా పడిందో? దాని వెనక ఎవరున్నారో అందరికీ తె లుసని చెప్పారు. బాధిత విద్యార్థిని వాట్సాప్ చాటిం గ్, వీడియోలు బయటపెడితే తద్వారా పోయే పరువును విపక్షాలు తీసుకొస్తాయా? అని మండిపడ్డా రు. ప్రవళిక అసలు గ్రూప్స్కే దరఖాస్తు చేయలేదం టే ఎందుకు నమ్మడం లేదని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలో జరిగిన లోటుపాట్లు సవరించుకుంటామని, మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ 24 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తే.. తాము 2,21,000 నియామకాలు చేపట్టినట్టు గుర్తు చేశారు. వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి ఆరున్నర లక్షల మంది పిల్లలకు విద్యను అందిస్తున్నామని, వారు ఐఐటీ, ఐఐఎం, నీట్లలో ర్యాంకులు సాధిస్తున్నారని చెప్పారు. 8వేలమందిని విదేశాలకు పంపి చదివిస్తున్నామని, వారిలో కొందరు ఉద్యోగాలు సృష్టిస్తున్నారని అన్నారు.
ఒక అమ్మాయిని ఒక అయ్యచేతిలో పెట్టాలంటే ఇటేడు తరాలు అటేడు తరాలు చూస్తారు. అలాంటిది రాష్ర్టాన్ని, రాష్ట్ర భవిష్యత్తును అన్ని కోణాల్లో ఆలోచించి ఓటర్లు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పడం ఖాయం. రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో ఎప్పుడు జైలుకు పోతారో తెలియదు? అలాంటి వ్యక్తి చేతుల్లో రాష్ర్టాన్ని పెడ్తారా?
– మంత్రి కేటీఆర్
అధికారంలో ఉన్నోళ్లు నచ్చకపోతేనే ప్రజలు వేరే పార్టీవైపు చూస్తారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. అన్నివర్గాలను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. ప్రజలు కూడా ఆయన్ని దీవిస్తున్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్కు ఓటెయ్యాలో? గాలిమాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీలకు ఓటెయ్యాలో? తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణకు కాబోయే సీఎం కేసీఆర్ అని ప్రజలెప్పుడో డిక్లరేషన్ ఇచ్చేశారు.
– మంత్రి కేటీఆర్