పోలీస్ శాఖ జాబ్మేళా భేష్
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశంస
541 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
తొర్రూరు, ఏప్రిల్ 16: సీఎం కేసీఆర్ సారథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ర్టానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మేళాలో మంత్రి పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియమాక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రపంచ మేటి పరిశ్రమలు తెలంగాణకు రావడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షా 35 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి స్పష్టంచేశారు. మరో 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. యువత ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలని, ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు వెతుక్కొంటూ వస్తాయని సూచించారు. జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన 53 కంపెనీలు పాల్గొన్నాయి. జిల్లాలోని 8 మండలాల నుంచి 1,517 మంది పాల్గొనగా 541 మంది ఉద్యోగాలు సాధించారు.