KTR | నిజామాబాద్ : ఐటీ హబ్ అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు.. స్థానిక యువత ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిబింబం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్లో వారు హైదరాబాద్, అమెరికా వెళ్లాలంటే ఒక మెట్టు ఇక్కడ ఎక్కేందుకు ఐటీ హబ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్, న్యాక్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అని కేటీఆర్ తెలిపారు. రూ. 50 కోట్లతో ఐటీ హబ్ నిర్మించాం. ఇక్కడ డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా చదివిన 1400 మంది పిల్లలకు ఉద్యోగాలు కల్పించాం. భవిష్యత్లో ఉద్యోగాలు కావాలన్నా.. మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నా నైపుణ్యం పెంచుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. మన భవిష్యత్ భద్రంగా, తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలంటే.. ఇలాంటి సదుపాయాలను అందిపుచ్చుకోవాలని కేటీఆర్ సూచించారు.
ఐటీ హబ్ పక్కనే ప్రత్యేకంగా రూ. 11 కోట్లతో న్యాక్ బిల్డింగ్తో పాటు హాస్టల్ వసతిని ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. దీన్ని కూడా డిప్లొమా, ఐటీఐ, టెన్త్ విద్యార్థులు వినియోగించుకోవాలి. ఈ సంస్థలన్నీ మీ కోసమే. రూ.7 కోట్లతో మున్సిపల్ కార్యాలయాన్ని అధునాతనంగా నిర్మించారు. బహుషా తెలంగాణలోనే బెస్ట్ మున్సిపాలిటీ కార్యాలయం ఇక్కడే ఉందని చెప్పొచ్చు. ట్యాంక్ బండ్ మాదిరిగానే రఘునాథ చెరువును మినీ ట్యాంక్ బండ్గా అద్భుతంగా తీర్చిదిద్దారు. పాలిటెక్నిక్ కాలేజీలో కొత్త బ్లాక్ను ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దుబ్బ ప్రాంతంలో మూడు వైకుంఠధామాలు 15 కోట్ల 50 లక్షలతో అద్భుతంగా నిర్మించారు. హైదరాబాద్లోని మహాప్రస్థానం కంటే ఈ వైకుంఠధామాలే బాగున్నాయని కేటీఆర్ తెలిపారు.