హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నేడు ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు మల్లాపురంలో రూ.4 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 9.30 గంటలకు నాచారంలోని పెద్ద చెరువు వద్ద 17.50 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ.411 కోట్ల అంచనా విలువతో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం, పది గంటలకు రూ.450 కోట్లతో చేపట్టే ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 10.15 గంటలకు ఉప్పల్ జంక్షన్లోనే రూ.2.20 కోట్లతో నిర్మించిన థీమ్ పార్కును ప్రారంభించనున్నారు. ఆపై పదిన్నర గంటలకు రామంతాపూర్లో వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా రూ.10.32 కోట్లతో చేపట్టే పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
కాగా, నగరంలో ట్రాఫిక్ చిక్కుల తొలగింపు, వాహనాల రద్దీ నియంత్రణే లక్ష్యంగా రూ.3,115 కోట్ల అంచనాతో 12 చోట్ల ఫ్లైఓవర్లు, లింకు వంతెనలు, ఆర్యూబీ, ఆర్వోబీలను నిర్మించనున్నామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. తొలిదశ పనులకు కొనసాగింపుగా రెండోదశను ప్రారంభించి నిర్ణీత వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. మొదటిదశలో 47 పనులకు ఇప్పటివరకు రూ.5,557 కోట్లు వెచ్చించామని.. ఇందులో చాలావరకు పనులు పూర్తికాగా, కొన్ని పురోగతిలో ఉన్నాయన్నారు. ఆరాంఘర్ మార్గంలో బహుదూర్పురా వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను వచ్చేనెలలో ప్రారంభిస్తామని, సెప్టెంబర్లోపు ఫలక్నుమా ఆర్వోబీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణాల వల్ల నగరంలో వాహనవేగం పెరిగిందని మంత్రి వివరించారు.