రాజన్న సిరిసిల్ల : ప్రతిపక్షాలు పొద్దున లేస్తే కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయి.. వారు శాపనార్థాలు పెడితే.. మీరే కాపాడాలి. మీ ఆశీస్సులు ఉంటే.. కేసీఆర్ను ఎవరూ ఏమీ చేయలేరని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగిలో రూ.3 కోట్ల 50 లక్షలతో నూతనంగా నిర్మించిన కేజీబీవీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు నేతృత్వంలో ఈ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో ముందుకు పోతుందన్నారు. రుద్రంగి ప్రాంతం ఒకనాడు తీవ్రవాదానికి చిరునామాగా ఉన్న ఈ ప్రాంతం .. స్వరాష్ట్రం వచ్చాక రుద్రంగి గ్రామం ఈ రోజు మండల కేంద్రంగా మారడమే కాకుండా అభివృద్ధిలో కూడా ముందు ఉంటుందన్నారు. రుద్రంగిలో కావలసిన మౌలిక వసతి సదుపాయాలను వెంటనే సమకూరుస్తూ కలెక్టర్ను నిధులు మంజూరు చేయాలని ఆదేశిస్తున్నానని తెలిపారు. సంక్రాంతి తర్వాత తాను ఎమ్మెల్యేతో వచ్చి అభివృద్ధి పనుల్లో పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. బండ మీది బడికి అవసరమైన మౌలిక వసతులు కూడా కల్పించే విధంగా ఆదేశాలు ఇస్తున్నానని తెలిపారు.
ఆసరా పెన్షన్లు, రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. ఈ పథకాల అమలును చూసి మహారాష్ట్రలోని 14 గ్రామాల సర్పంచ్లు, ప్రజలు తమను తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా అవతల ఉన్న కర్ణాటకలోని రాయిచూర్ ప్రజలు కూడా తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. అక్కడి ఎమ్మెల్యే.. కర్ణాటక మంత్రి ముందే మమ్మల్ని కూడా తెలంగాణలో కలుపుకోమని అడుగుతున్నారని గుర్తు చేశారు.
మన రాష్ట్రంలో 2014లో పెన్షన్లు 26 లక్షల మందికి వస్తే.. ఇప్పుడు రూ. 2 వేల పెన్షన్ 46 లక్షలు మందికి వస్తుందని తెలిపారు.
గతంలో రూ. 65 వేల కోట్లు 66 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద ఇచ్చాం. ఇప్పుడు ఈ నెల 28 నుంచి రూ. 7600 కోట్లు మళ్లీ రైతుబంధు కింద ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇంటింటికి తాగునీరు అందిస్తూ ఆడపిల్లలకు కష్టం లేకుండా చేశాం. చాతనైతే దమ్ముంటే మా కంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి ప్రజల మనసులు గెలుచుకోవాలని ప్రతిపక్షాలకు కేటీఆర్ సూచించారు.