రాజన్న సిరిసిల్ల : విద్య అనేది మన నుంచి దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేజీ టు పీజీ క్యాంపస్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రం సిధ్దించిన తర్వాత కేజీ టు పీజీ వరకు ఒకే ఆవరణలో నెలకొల్పుతామని 2004లోనే కేసీఆర్ చెప్పారు. ఆనాటి మాట కేసీఆర్ నిలబెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విద్యకు పెద్దపీట వేశామన్నారు. కేజీ నుంచి పీజీ దాకా చక్కటి ప్రమాణాలతో బ్రహ్మాండమైన విద్యను అందిస్తున్నాం. మన పిల్లలను ప్రపంచంతో పోటీ పడే విధంగా తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు స్థాపించాం అని కేటీఆర్ తెలిపారు. గురుకుల విద్యార్థులకు సంబంధించి ఒక్కొక్కరిపై రూ. లక్షా 20 వేలు ఖర్చు పెడుతున్నాం. విద్య అనేది మన నుంచి దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు. విద్య ద్వారా సమకూరే జ్ఞానాన్ని ఎవరూ కూడా తస్కరించలేరు. అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన ఊరు – మన బడి పేరిట రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు. తెలంగాణ పుట్టి ఎనిమిదిన్నరేండ్లు అవుతుంది. 75 ఏండ్ల స్వతంత్య్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమాన్ని తెలంగాణలో తీసుకుపోతున్నాం. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో వేలు పెట్టి చూపే పరిస్థితి లేదన్నారు. ప్రజల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం, జనహితమే మా అభిమతం అనే దిశగా ముందుకు పోతున్నాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు..
విద్యా ప్రమాణాలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతోనే మన ఊరు -మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అని కేటీఆర్ పేర్కొన్నారు. నాయకుడికి మనసు ఉంటే ఎలాంటి పనులు జరుగుతాయనడానికి ఇలాంటి కార్యక్రమాలే నిదర్శనం. డైనింగ్ హాల్ అద్భుతంగా నిర్మించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ను మనం గుర్తు చేసుకోవాలి. ఆయన పేరిట ఇప్పటికే ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పెట్టుకున్నాం. ఈ పాఠశాలకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని కేటీఆర్ సూచించారు.