Minister KTR | కులం, మతమేదైనా గురుకులాల ద్వారా మంచి శిక్షణ అందిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల పిల్లలను ప్రపంచంతో పోటీపడేలా పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేసి ప్రతి ఏటా గురుకుల విద్యపైన 6వేలకోట్లకుపైగా నిధులను వెచ్చిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థుల కోసం 204 గురుకుల ను ఏర్పాటు చేశామని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్ధిపై ఏటా రూ.1.20 లక్షల ఖర్చు చేస్తున్నామన్నారు.
సిరిసిల్ల పట్టణంలో మైనారిటీ సంక్షేమ శాఖ, సిరిసిల్ల ఎమ్మెల్యే నిధులు రూ.1.10 కోట్లతో నూతనంగా నిర్మించిన ముస్లిం షాదీఖానా భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కుల మతాలకతీతంగా పనిచేశారని గుర్తు చేశారు. ప్రజలను ప్రజలుగా చూశారే తప్ప మతం పేరు మీద కులం పేరు మీద ఎప్పుడు రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తాయన్నారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకూ పథకాలతో పేద ప్రజలు లబ్ధిపొందుతున్నారన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, జేఎన్టీయూ కళాశాల సహా అనేక కళాశాలలు తెచ్చి విద్యాభివృద్ధి కి కృషి చేశామన్నారు. ఓవర్సీస్ విద్యా నిధి కింద విదేశాల్లో 7వేల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని తెలిపారు. పథకాలు లబ్ధి పొందేందుకు కుల, మత, రాజకీయ, వర్గ భేదాలేమీ లేవన్నారు. అర్హులైతే చాలు పక్కాగా వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుత ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు కాకుండా తాము ఏం చేశారో.. చేస్తారో చెప్పి ప్రజల మనసు గెలుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు ముస్లిం షాదీఖానాకు టెంట్ సామగ్రి సమకూర్చుకునేందుకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
టౌన్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రెస్క్లబ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి పరకాల ప్రవీణ్, ఉపాధ్యక్షుడు అతికం రఘువీర్, కోశాధికారి కాయితి మహేందర్, సహా కార్యదర్శి రాపెల్లి భాస్కర్, కార్యవర్గ సభ్యులు అల్లే రమేశ్, నాయిని బాబు, దాసరి శిరీష, జాన దయానంద్, అన్సార్ అలీ, జక్కని రాజా రమేశ్తో మంత్రి ప్రమాణం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.
సిరిసిల్ల పట్టణంలో ఐడీఓసీ సమీపంలోని రగుడు కూడలి అభివృద్ధికి రూ.7 70కోట్లతో బై పాస్ కూడలి అభివృద్ధి, సుందరీకరణ, బైపాస్ రోడ్డు సెంట్రల్ లైటింగ్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ యూసుఫ్, ఆర్డీఓ టీ శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.