24 గంటలు పోయి 3 గంటల కరెంటిచ్చే మార్పు కావాల్నా?
నిండిన చెరువు పోయి ఎండిన చెరువు వచ్చే మార్పు కావాల్నా?
రైతుబంధును ఎత్తగొట్టే మార్పు కావాల్నా?
ఎమ్మెల్యే కోసం హైదరాబాద్కు పోయే మార్పు కావాల్నా?
ఇదేనా కాంగ్రెస్ నేతలు రావాలంటున్న మార్పు?
ఢిల్లీవోడు ఉస్కో అంటే ఇక్కడోళ్లు ఉస్కో అని, పిస్కో అంటే పిస్కో అంటరు. ప్రతి దానికి ఢిల్లీవోని పర్మిషన్ అడుగుతరు. తుమ్మెతందుకు కూడా పర్మిషన్ అడుగుతరు. మన తెలంగాణల మనోడు ఉండాలే గానీ, మంది చేతిల పెడితే మళ్లా 55 ఏండ్లు తన్నించుకున్నట్టే.
-మంత్రి కేటీఆర్
(నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్) : రైతుబంధు ఆపిన రాబందు కాంగ్రెస్ను తరిమికొట్టాలని, రైతుబంధువు కేసీఆర్ను ఆదరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. రైతులకు రైతుబంధు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైతే, ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ రాసి రైతల నోట్లో మట్టికొట్టిందని మండిపడ్డారు. ‘దౌర్భాగ్యపు దుష్ట పార్టీకి చెందిన అవినీతి నాయకుడు, కాంగ్రెసోడు రేవంత్రెడ్డి మళ్లోసారి దుర్మార్గపు పనిచేసిండు. రైతుబంధు ఇప్పటికే మనం 11 సార్లు వేసుకున్నం. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు పడ్డయి. ఇదేం కొత్త ప్రోగ్రాం కాదు.
ఎప్పటినుంచో ఉన్నదే. మళ్లా నాటు వేసే టైం వచ్చింది కాబట్టి రైతుబంధుకు అవకాశం ఇవ్వాలని ఈసీకి సీఎం కేసీఆర్ లేఖ రాసిండు. సరే ఇచ్చుకోండి ఫర్వాలేదు అని వాళ్లు పర్మిషన్ ఇచ్చిన్రు. కానీ ఈ అడ్డమైన కాంగ్రెసోడు రేవంత్రెడ్డి.. రైతుబంధు ఇస్తే కేసీఆర్కు లాభమైతది. ఎన్నికల్లో ఓట్లు వేస్తరు. దాన్ని ఆపాలే అని ఈసీకి లేఖ రాసి రైతుల నోటికాడి ముద్దను గుంజుకపోయిండు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ములుగు, చెన్నూరు, పెద్దపల్లి, ధర్మపురి, హుజూరాబాద్, ముషీరాబాద్, అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థులు బడే నాగజ్యోతి, బాల్క సుమన్, దాసరి మనోహర్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పాడి కౌశిక్రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్కు మద్దతుగా సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో, మంచిర్యాల జిల్లా చెన్నూరులో, పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్, ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్, హుజూరాబాద్, ముషీరాబాద్, అంబర్పేటల్లో నిర్వహించిన రోడ్షోల్లో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రైతులు, రైతు బిడ్డలు ఒక్కటే ఆలోచించాలె. ఇంకా నాలుగు ఓట్లు డబ్బాల పడకముందే రైతుల నోటికాడి ముద్దను గుంజుకున్న దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్. రేపు అవకాశం ఇస్తే రైతుబంధును ఉంచుతదా? ‘తెలంగాణలో ఉన్నదంతా బీద, బిక్కి రైతులు.. వీళ్ల ముఖాలకు మూడు ఎకరాలకంటే ఎక్కువ లేదు. మూడు ఎకరాలకు మూడు గంటలు ఇస్తే చాలు. 10 హెచ్పీ మోటర్ పెట్టి గుంజుడు గుంజితే మూడు గంటల్లో పొలం పారుతది’ అని రేవంత్రెడ్డి అంటున్నడు.
మరి ఇక్కడికి వచ్చిన రైతుబిడ్డలు ఎవలకన్న 10 హెచ్పీ మోటర్ ఉన్నదా? 30న ఓటు బటన్ ఒత్తే ముందు ఒకటే ప్రశ్న మనసులో అడగండి. కరెంట్ కావాల్నా? కాంగ్రెస్ కావాల్నా? అని ఆలోచించుకోండి. ఎందుకంటే కరెంట్ కావాలంటే కాంగ్రెస్ ఉండదు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు’ అని స్పష్టం చేశారు. రైతుబంధు ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకునే కేసీఆర్ కావాలా? రాబందుల్లా అన్నీ తన్నుకుపోయి, తీసేసి వేధించే కాంగ్రెస్ కావాలా? అన్నది ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కాటగలుస్తదని, రైతుబంధు తీసేస్తారని వెల్లడించారు.
కాంగ్రెస్ రైతు భరోసా ఒక్కరికే
భూమి ఉన్న రైతుకు రైతుబంధు ఇస్తే, కౌలుదారుకు ఇయ్యనని.. కౌలుదారుకిస్తే రైతుకు ఇయ్యనని రేవంత్రెడ్డి అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు. కౌలు రైతుకే ఇస్తా అంటే ఎవరన్నా రైతుకు తమ భూమిని కౌలుకు ఇస్తరా? అన్నది ఆలోచించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణకు రక్ష అని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘రైతుబంధు పెట్టిందెవరు? రైతుబీమా పెట్టిందెవరు? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తెచ్చిందెవరు? 2వేల పింఛన్లు ఇచ్చిందెవరు? ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇస్తున్నదెవరు? ఇంటింటికీ నీళ్లిస్తున్నదెవరు?’ అని అడిగి ప్రజల నుంచి సమాధానం చెప్పించారు.
ఇన్నిజేసిన కేసీఆర్, కరెంటు మంచిగజేసి బతుకులు బాగుజేసిన కేసీఆర్, రైతును రాజు జేసిన కేసీఆర్తోనే రాష్ట్రం మరింత బాగుపడుతుందని తెలిపారు. ‘రైతుకు మంచి చేస్తున్న ఒకే ఒక్క సీఎం కేసీఆర్. ఆయన బొండిగ పిసుకాల్నని ఢిల్లీ నుంచి మోదీ, అమిత్షా, యోగీలు, బోగీలు, 15 మంది ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాహుల్ గాంధీ, ఖర్గే, గిర్గేలు దిగుతున్నారు. ఇక్కడ ఉండే సన్నాసులతో ఊదు కాలదు. పీరు లేవదు’ అని విమర్శించారు. ‘ఇవాళ దేశంలో ఆడపిల్లలు మోదీని ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు. పిరమైన ప్రధానమంత్రి అంటున్నరు. అన్ని పిరం చేసి పిరమైన ప్రధానమంత్రి పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకండి. ఆ ఒక్క ఓటు వేసినా మోరిలో పారేసినట్టే అవుతుంది. 3న మళ్లా గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే. వచ్చేది కేసీఆర్ సర్కారే’ అని స్పష్టం చేశారు.
జనవరిలో కొత్త రేషన్కార్డులు
మూడోసారి అధికారంలోకి వచ్చాక జనవరిలో కొత్త రేషన్ కార్డులు, మ్యానిఫెస్టోలో పొందుపర్చిన ఆసరా పింఛను పెంపు, అన్నపూర్ణ పథకం కింద ప్రజలకు సన్నబియ్యం, రూ.400కే వంటగ్యాస్, సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18 ఏండ్లు నిండిన ఆడబ్డిలకు రూ.3 వేలు, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తామని కేటీఆర్ తెలిపారు. ఓట్ల లెక్కింపులో కారు గుర్తు దుమ్ములేపేలా 30వ తేదీన ఓట్లు గుద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ వెంకటేశ్నేత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, మాజీ మంత్రి బోడ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ ట్వీట్ యథావిధిగా..
పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు? ఎరువులకు, విత్తనాలకు పైసలిచ్చే రైతుబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు? ఎవుసం చేసే రైతులపైన పగ ఎందుకు? అన్నదాతకు సాయం అందకుండా అడ్డుపుల్లలు వేసి వికృతానందం పొందుతున్నారెందుకు? దుకిదున్నే బక రైతులపై ద్వేషం ఎందుకు? అన్నంపెట్టే రైతుల మీద అకసు ఎందుకు? కర్షకుడికి కడుపునిండా కరెంట్ ఇస్తుంటే చూసి ఓర్వలేని బుద్ధి ఎందుకు? 3 గంటల కరెంటే ఇస్తం..10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని మూర్ఖంగా ప్రకటిస్తున్నారెందుకు? రైతుచేనుకు రక్షణ కంచెగా ఉండే ధరణి మీద కక్ష ఎందుకు? దళారుల రాజ్యం తెచ్చి భూమేతకు అనుమతి ఇస్తామని నిస్సిగ్గుగా చెప్తున్నారెందుకు? కౌలు రైతులకు.. అసలు రైతులకు మధ్య అగ్గిపెట్టి భూములు పడావు పెట్టే ప్రమాదాన్ని తెస్తున్నారెందుకు? అన్నదాతలారా.. మీ వెన్నువిరిచే కాంగ్రెస్ కంత్రీ పాలసీలను జాగ్రత్తగా పరిశీలించండి! పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండుగ చేసే దరిద్రపు రోజులు కావాలా? ఆలోచించండి! రైతుబంధువును ఆదరించండి..! రాబందులను తరిమికొట్టండి..!