హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (నమ స్తే తెలంగాణ ): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్టుబడులు ఆగిపోతాయని, అస్థిరపాలన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తొమ్మిదిన్నరేండ్లలో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయని, రియల్ ఎస్టేట్, నిర్మా ణ, హాస్పిటాలటీ రంగాలు విస్తరించాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. వికారాబాద్ మరిపల్లి, చేవెళ్ల, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ అభ్యర్థులు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, మాధవరం కృష్ణారావు, వివేకానంద తరఫున ప్రచారం చే శారు.
ఈ సందర్భంగా 8 చోట్ల కార్నర్ మీటింగ్లలో కేటీఆర్ మాట్లాడారు. మంచిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని, కులమతాల మధ్య చిచ్చుపెట్టే మూకలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి తమ మతమని.. సంక్షేమం తమ కులమని పునరుద్ఘాటించారు. ఈ తొమ్మిదిన్నరేండ్లలో కులాల కుంపట్లు, మతాల మంటలు లేవని, హైదరాబాద్ అభివృద్ధే ల క్ష్యంగా బీఆర్ఎస్ పాలన సాగిందని వివరించారు. డబుల్ ఇండ్లు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, హైదరాబాద్ ప్రగతి, పురోగతి దిశలో సాగాలంటే కేసీఆర్ పాలన అవసరమని నొక్కి చెప్పారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కాపు, కమ్మ, క్షత్రియ వర్గాలకు సైతం భూములు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ప్రశంసించారు. మరింత అభివృద్ధి జరగాలన్నా బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని కేటీఆర్ కోరారు.
బీఆర్ఎస్ స్కీముల పార్టీ.. కాంగ్రెస్ స్కాముల పార్టీ. బీఆర్ఎస్ రైతుబంధు పార్టీ.. కాంగ్రెస్ రాబందుల పార్టీ. మళ్లీ వారిని తెచ్చుకుందామా? ఆగం కాకుండా ఆలోచించండి. బీజేపీ సన్నాసులకు మతం పేరిట చిచ్చుపెట్టుడు తప్ప మరేం తెల్వదు.
-మంత్రి కేటీఆర్
రాహుల్ వచ్చి బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటారని, తమది బీటీం అయితే కేసులు ఎందుకు పెట్టారని కేటీఆర్ ప్రశ్నించారు. తమను బెదిరించారని, భయపెట్టారని పేర్కొన్న కేటీఆర్.. మెడ తెగినా ఢిల్లీకి తలవంచేది లేదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ముస్లిం మైనార్టీలకు కేవలం 230 కోట్లు ఖర్చు చేస్తే, కేసీఆర్ ప్రభుత్వం 12 వేల కోట్ల ను ఖర్చు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు. రాష్ట్రంలో మూడెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఎవరూ లే రని, వారికి 3 గంటల కరెంటు సరిపోతుందని, 10 హెచ్పీ మోటారు చాలన్న రేవంత్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ కావాలో? కరెంటు కావాలో? ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.
రంగారెడ్డి జిల్లాలో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న 111జీవో ఎత్తేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 111 జీవో ఎత్తివేతతో చేవెళ్ల, మొయినాబాద్తోపాటు ఇతర ప్రాంతాల రైతులందరికీ లాభం చేకూరేలా చూస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో హైదరాబాద్లో ప్రతిరోజూ తాగునీటిని ఇస్తామని, నగరంలో మరిన్ని ఫ్లై ఓవర్లు నిర్మించుకుందామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆడబిడ్డల పెండ్లికి ‘కల్యాణలక్ష్మి’ని అందిస్తున్నట్టుగానే, మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రతి మహిళకు సౌభాగ్యలక్ష్మి పేరిట ప్రతినెలా 3 వేలు ఇస్తామని తెలిపారు. పెన్షన్లు పెరుగతాయని, సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. రైతులకు జీవితబీమా అందిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. తెల్లరేషన్కార్డు కుటుంబాలకు ‘కేసీఆర్ బీమా.. ఇంటింటికీ ధీమా’తో 5 లక్షల బీమా కల్పిస్తామని వివరించారు. డిసెంబర్ 3 తర్వాత గ్యాస్ సిలిండర్ను 400కే అందిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 15 లక్షలకు పెంచుతామని పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి చూసి రజనీకాంత్లాంటి ప్రముఖులే ఆశ్చర్యపోతుంటే ఇక్కడి ప్రతిపక్ష గజనీలు దానిని గ్రహించలేకపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. మెరుగైన వసతులు, శాంతియుత వాతావరణం వల్లే పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం ఉన్నప్పుడే హైదరాబాద్ బాగుంటుందని, నగరం బాగుంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులకు చేవ, సత్తా లేదని కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు కట్టుబడి పనిచేస్తున్న కేసీఆర్ను నిలువరించేందుకు బీజేపీకి చెందిన 15 రాష్ర్టాల సీఎంలు, కేంద్రమంత్రులు, ఇతర నాయకులు.. కాంగ్రెస్ నుంచి రాహుల్గాంధీ, మల్లికార్జునఖర్గే వంటి నాయకులు హైదరాబాద్లో దిగుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మాత్రం సింగిల్గానే వస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కే నవీన్కుమార్, ఎంపీ రంజిత్రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
అలకలు, అసంతృప్తులు ఎక్కడైనా ఉంటాయి. అలిగినా, గులిగినా ఓటు మాత్రం బీఆర్ఎస్కే గుద్దండి. కాంగ్రెస్ వస్తే హైదరాబాద్ ప్రగతి కుక్కలు చింపిన విస్తరే. పనిచేసే ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
-మంత్రి కేటీఆర్