KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా చేసుకొని రాష్ర్టాన్ని ప్రగతిపథంలోకి తీసుకువెళ్లామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలన్నా, శాంతిభద్రతలు బాగుండాలన్నా, హైదరాబాద్ విశ్వనగరం కావాలన్నా స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వంతోనే సాధ్యమని తెలిపారు. మంచి చేసే నాయకుడిని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల ప్రేమ ఉంటే వచ్చే టర్మ్లో మెట్రోను 250 కిలోమీటర్ల వరకు విస్తరిస్తామని తెలిపారు. శివారు ప్రాంతాల్లో రూ.25 వేల కోట్లతో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్తు మాదిరిగానే 24 గంటలు తాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గ అభ్యర్థులు అరెకపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్కు మద్దతుగా కేటీఆర్ రోడ్షో నిర్వహించారు. శేరిలింగంపల్లిలో మూడు ప్రాంతాలు తారానగర్ తుల్జాభవానీ దేవాలయం, ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి ఆల్విన్కాలనీ లాస్ట్బస్టాప్, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాటేదాన్ స్వప్న థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కేటీఆర్ ప్రసంగించారు.
కాంగ్రెస్ చేతిలో పెడితే ఆగం చేస్తారు
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను కాంగ్రెస్ చేతిలో పెడితే ఆగం చేస్తారని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. స్కాములు చేసి రాష్ర్టాన్ని మింగాలనే కాంగ్రెస్ చూస్తుందని ఆరోపించారు. ఆరు నెలలకోసారి ముఖ్యమంత్రి మారితే హైదరాబాద్ అభివృద్ధి కునారిల్లుపోతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు ఒరిగేదేమీ లేదన్నారు. గడిచిన 50 ఏండ్లలో మైనార్టీలు ఓట్లు వేసే యంత్రాలుగానే ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 3 తర్వాత ప్రతీ మహిళకు సౌభాగ్యలక్ష్మి పేరిట ప్రతి నెల రూ. 3వేలు ఇస్తామని, ఆసరా పెన్షన్లు రూ.5వేలు చేయబోతున్నామని చెప్పారు. తెల్ల రేషన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. తెల్ల రేషన్కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ‘కేసీఆర్ బీమా.. ఇంటింటికీ ధీమా’ కార్యక్రమం ద్వారా రూ. 5లక్షల జీవిత బీమాను వారం రోజుల్లో అందిస్తామన్నారు. ఆడబిడ్డలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. అదనంగా లక్ష డబుల్ బెడ్ర్రూం ఇండ్లు కట్టించి పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధరణి కావాల్నా.. దరిద్రం కావాల్నా
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, హనుమకొండ జిల్లా జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్లతో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతన్నల భూమికి అన్ని విధాలా రక్షణ ఉండేలా తెచ్చిన ధరణి వ్యవస్థ కావాల్నా.. రైతుల భూములను ఇష్టారీతిన పరాధీనం చేసిన కాంగ్రెస్ తెస్తానంటున్న దరిద్రం కావాల్నా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడైనా 3గంటల కరెంటుతో 3 ఎకరాల పొలం పండించే రైతులు మీ వద్ద ఉన్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తొలగించి మళ్లీ పటేల్, పట్వారీ దళారీ వ్యవస్థలను ముందుకు తీసుకొస్తామని బాహాటంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 2700 కోట్లతో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ రెండుసార్లు విజయవంతంగా పూర్తయిందని, లక్ష ఎకరాలు రానున్న రోజుల్లో సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు. ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటుందని, వారు 20 సీట్లు కూడా దాటరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం ఖాయమన్నారు. కరీంనగర్లో చెల్లని రూపాయిలాంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో ఎలా చెల్లుతాడని విమర్శించారు.
కాంగ్రెస్కు అవకాశమిచ్చి ఆగమవుదామా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, కరెంట్ వద్దనుకుంటే కాంగ్రెస్కు ఓటేయాలన్నారు. చేనేత మిత్ర పథకం కింద ప్రతి నెలా రూ. 5వేల ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుట్ల ప్రభాకరరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. ఫ్లోరైడ్ను అంతం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏండ్లు పాలించినా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, ఎరువులు ఇవ్వలేదని మండిపడ్డారు. డిసెంబర్ మూడో తేదీ తర్వాత నాలుగు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో కారు పార్టీ గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పాల్వాయి స్రవంతిరెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, ఎలిమినేటి సందీప్రెడ్డి, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడైనా 3 గంటల కరెంటుతో మూడు ఎకరాల పొలం పండించే రైతులు ఉన్నారా? తాము అధికారంలోకి వస్తే ధరణిని తొలగించి మళ్లీ పటేల్, పట్వారీ దళారీ వ్యవస్థలను తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు నిస్సిగ్గుగా చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 20 సీట్లు కూడా దాటవు. – మంత్రి కేటీఆర్
కరెంటు గురించి మాట్లాడే కాంగ్రెస్కు సిగ్గులేదు
కరెంటుపై మాట్లాడే కాంగ్రెస్ నాయకులకు సిగ్గు, నైతికత లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ కోదాడ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడలో ఖమ్మం క్రాస్రోడ్ నుంచి రంగా థియేటర్ చౌరస్తా వరకు గురువారం నిర్వహించిన రోడ్షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో గుంతల రోడ్లు, మురికి వాడలు, విద్యుత్ కోతలు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి కరెంట్ అని విమర్శలు గుప్పించారు. మల్లన్న వచ్చాక కోదాడ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు కాళేశ్వరం జలాలు అందుతున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధికి పాటు పడే మల్లన్నను గెలిపించుకుందామా? అభివృద్ధి అడ్రస్ తెలియని కాంగ్రెస్కు ఓటేద్దామా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ 55 ఏండ్లు పాలించినా రైతులకు సాగునీరు, ఎరువులు, ప్రజలకు తాగునీరు ఇవ్వలేకపోయింది. కారు గెలుపు పక్కా అని తేలిపోయింది. డిసెంబరు మూడో తేదీ తర్వాత నాలుగు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం.
– మంత్రి కేటీఆర్