Minister KTR | నిజామాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన నానమ్మ పుట్టిన ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారు. సీఎం కేసీఆర్ మాతృమూర్తి యాది లో ఆమె స్వగ్రామంలో కార్పొరేట్ను తలదన్నే లాతన సొంత నిధులతో సర్కారు బడిని నిర్మించారు. గ్రామస్థులకు హామీ ఇచ్చిన ఏడాదిలోపే సర్వాంగ సుందరంగా పాఠశాలను సిద్ధం చేసి, శెభాష్ అనిపించుకొన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్ గ్రామంలో సరి గ్గా ఏడాది క్రితం మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో సొంత నిధులతో కట్టిస్తున్న ప్రభుత్వ బడి కూడా ఒకటి. అతి త్వరలోనే ఈ అధునాతన సర్కారు బడి ప్రారంభోత్సవం వైభవంగా జరుగనున్నది. కేటీఆర్ ఈసారి తన మాతృమూర్తి కల్వకుంట్ల శోభతో కలిసి పూర్వీకుల గ్రామాన్ని సందర్శించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
అరొకర వసతుల నుంచి ఆహ్లాదకరంగా
కోనాపూర్లో ఒకప్పుడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది. సౌకర్యాల లేమి, టీచర్ల కొరతతో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ స్కూల్ను ప్రాథమికస్థాయికి (ఐదో తరగతి) పరిమితం చేశారు. ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే విద్యాబోధనకు అవకాశం ఉంది. గ్రామ శివారులోని ఎకరం భూమిలో కేటీఆర్ రూ.2.40 కోట్లు వెచ్చించి ఈ సర్కారు బడిని సర్వాంగ సుందరంగా నిర్మించారు. సకల వసతులతో కార్పొరేట్ బడి లా కనిపిస్తున్నది. బాల, బాలికల కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా మరుగుదొడ్లు కట్టించారు. ప్ర తి తరగతి గదిలో ఫర్నిచర్ను సమకూర్చారు. కార్పొరేట్తరహా కుర్చీలు, బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. సమావేశాలకు ప్రత్యేకంగా మరో గదిని కూడా అందుబాటులోకి తీసుకువచ్చా రు. విద్యార్థుల ఉల్లాసం కోసం ప్రత్యేకంగా ఆటవస్తువులను ఏర్పాటు చేశారు.
పరవశించిపోతున్న కోనాపూర్
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని కోనాపూర్ మంత్రి కేటీఆర్ దాతృత్వంతో పరవశించిపోతున్నది. భావితరాల భవిష్యత్తు కోసం కేటీఆర్ చూపుతున్న ప్రేమానురాగాలకు ఈ ప్రాంత బిడ్డలంతా ఫిదా అవుతున్నారు. 2022 మే 10న మంత్రి కేటీఆర్ బడికి భూమి పూజ చేయగా.. రూ.2.40 కోట్లతో వేగంగా పనులు చేపట్టారు. దీంతోపాటు రూ.2.50 కోట్ల ప్రభుత్వ నిధులతో కోనాపూర్కు వెళ్లే హైలెవల్ బ్రిడ్జి సైతం పూర్తయ్యింది. గ్రామంలో రూ.75 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. తాగునీటి ఎద్దడి తీర్చేందుకు కేటీఆర్ హామీ మేరకు పైప్లైన్లు ఏర్పాటు చేశారు. గ్రామస్థుల కోరిక మేరకు మంత్రి కేటీఆర్ నాయనమ్మ గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. కోనాపూర్ గ్రామంలో రోడ్లు, వంతెన నిర్మాణాలతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేశారు. కేటీఆర్ చొరవతో పల్లె ప్రగతిలో భాగంగా కోనాపూర్ గ్రామం అభివృద్ధికి నమూనాగా మారిపోయింది.
కేసీఆర్ మాతృమూర్తి పుట్టింది అక్కడే..
సీఎం కేసీఆర్ మాతృమూర్తి వెంకటమ్మ పు ట్టి, పెరిగింది అంతా ప్రస్తుతం కామారెడ్డి జిల్లాబీబీపేట మండలం పోసానిపల్లి. ఇప్పుడు ఈ గ్రామాన్ని కోనాపూర్గా పిలుస్తున్నారు. అప్ప ర్ మానేరుడ్యాం బ్యాక్ వాటర్కు కూతవేటు దూరంలోనే ఈ గ్రామం ఆవరించి ఉంది. అప్పర్ మానేరులో పోసానిపల్లితోపాటు పొ లాలు, ఇండ్లు మునిగి పోవడంతో కొంత మం ది దగ్గర్లోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. కేసీఆర్ తల్లిదండ్రులు పోసానిపల్లిని వదిలి సిద్దిపేట జిల్లాలోని చింతమడకకు వెళ్లారు. ఇక్కడే రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు జన్మించారు. చింతమడకలో కేసీఆర్ జన్మించారు. ఇప్పటికీ కేసీఆర్ తల్లిగారి తరఫువారు ఈ గ్రామంలో నివాసం ఉంటున్నారు. పలువురు వ్యాపార, వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిర పడ్డారు. అయినా గ్రామంతో సంబంధాలను వదులుకోలేదు. కేసీఆర్తోనూ ఇక్కడి కుటుంబాలకు సత్సంబంధాలు ఉన్నాయి.
నానమ్మ సంతోషిస్తుంది
నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థం ఆమె గ్రామం కామారెడ్డి జిల్లా కొనాపూర్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణం పూర్తయ్యిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్టుగా ఆయన వివరించారు. దీని ద్వారా మా నానమ్మ సంతోషిస్తుందని అనుకుంటున్నానని ట్విట్టర్లో తెలిపారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా నిరుడు మంత్రి కేటీఆర్ తన సొంత నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
మా ఊరి మనువడు కేటీఆర్
మా కోనాపూర్ మూలాలున్న కేసీఆర్ ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం మాకు చాలా గర్వకారణం. కేసీఆర్ కొడుకు కేటీఆర్ నిరుడు మా ఊరికి వచ్చిండు. చెప్పిన మాటను చెప్పినట్టే చేసిండు. స్కూల్ను అద్భుతంగా కట్టించిండు. సౌలత్లు కూడా మంచిగా ఏర్పాటు చేసిండు. మా గ్రామ పిల్లల చదువు కోసం ఇంత శ్రద్ధ తీసుకుని సొంత పైసలతో బడి కట్టించడం సంతోషంగా ఉంది. కోనాపూర్కు కేటీఆర్ వచ్చినప్పుడు ఊరంతా ఆనందపడ్డాం. మరోసారి కేటీఆర్ వస్తుండని తెలిసి సంబురంగా ఉంది. మా ఊరి మనువడు కేటీఆర్ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. – నర్సవ్వ, సర్పంచ్, కోనాపూర్ గ్రామం
స్కూల్ విశేషాలు
నిర్మాణం : జీప్లస్ వన్
క్లాస్రూంలు : 14
ఫస్ట్ ఫ్లోర్ : 7 తరగతి గదులు
గ్రౌండ్ ఫ్లోర్ : 7 తరగతి గదులు, హెచ్ఎం, వెయిటింగ్, లైబ్రరీ రూం