Minister KTR | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలని, నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రైతులకు భరోసా ఇచ్చేలా, వారికి విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలని సూచించారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను సమన్వయం చేస్తున్న ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు పంచాయతీరాజ్ రోడ్ల పనులను వర్షాకాలం వచ్చేలోగా పూర్తి చేయించుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో ఉపాధిహామీ, పంచాయతీరాజ్, పట్టణప్రగతి, పల్లెప్రగతి తదితర కార్యక్రమాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వీటన్నింటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఉపాధిహామీకి సంబంధించి రూ.1,300 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ర్టానికి విడుదల కానందున బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కార్యకర్తలకు పంపిన సందేశాన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఉద్యమకాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ, రెండుసార్లు ప్రభుత్వ ఏర్పాటుకు కార్యకర్తలు చేసిన కృషిని వివరిస్తూ ముఖ్యమంత్రి పంపే ప్రత్యేక సందేశం ప్రతి కార్యకర్తకూ చేరవేయాలని చెప్పారు. ప్రతి 10 గ్రామాలు, నాలుగైదు డివిజన్లకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని సూచించారు. ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ కార్యకర్తల ప్రాధాన్యం, వారితో ఉన్న అనుబంధం, తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, స్వరాష్ట్రంలో మారిన ముఖచిత్రం వంటి అంశాలను ప్రతీ కార్యకర్తకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. దీంతోపాటు దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులపై కూడా విస్తృతంగా చర్చించాలని చెప్పారు.
ప్రధాని మోదీ పాలనలో పెరిగిన పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు వంటి వాటిని కార్యకర్తలకు అర్థమయ్యేలా వివరించాలని, ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు, తెలంగాణకు చేసిన అన్యాయాలను ప్రత్యేకంగా చర్చించాల ని కోరారు. తెలంగాణకు నిధులు రాకుండా కేంద్రం అడ్డుకోవడం, ఇవ్వాల్సినవి ఇవ్వకుండా పెం డింగ్లో పెట్టడం, తద్వారా రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న తీరును ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకం గా మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహిళా లోకానికి చేరవేయాలని సూచించారు.
ఏప్రిల్ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. ఇంకా ఎక్కడైనా ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభం కాకపోతే వాటిని ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు రాష్ట్రస్థాయి నాయకులు, పార్టీ నేతలు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని చెప్పారు. ఏప్రిల్ 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశాలకు 1,000 నుంచి 1,500 మంది పార్టీ ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం లో, ప్రతి వార్డులో జెండా పండుగ నిర్వహించాలని, అదే రోజు పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు మాత్రమే హాజరుకావాలని చెప్పారు.