KTR | కాంగ్రెస్ పాలనలో కరెంటు, సాగునీటికి ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు మళ్లీ ఆ దిక్కు మాలిన పాలన రాష్ట్రం కావాలా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇవాళ భూపాలపల్లిలో జిల్లాలో రూ.276కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండాయి. ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు పని చేస్తూ వచ్చారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడన్నా అమలవుతున్నాయా? ఆలోచించాలని కోరుతున్నా.
జరుగుతున్న మాట వాస్తమైతే పక్క రాష్ట్రాల ప్రజల తెలంగాణలో ఎందుకు కలవాలని తహతహలాడుతున్నారు? ఆలోచించాలని కోరుతున్నా. ఆదిలాబాద్ను ఆనుకొని మహారాష్ట్ర ఉంటుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన సర్పంచులు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వద్దకు వచ్చి మా గ్రామాలను మీ రాష్ట్రంలో కలుపుకోవాలని కోరుతున్నరు. మా దగ్గర రైతుబంధు లేదు, కరెంటు లేదు, నీళ్లు వస్తలేవు, రైతుబీమా లేదు, ఆడపిల్లల పెళ్లి చేసుకుంటు కల్యాణలక్ష్మి రాదు, ముసలివారికి ఆసరా పింఛన్లు రావడం లేదని చెప్పి తెలంగాణలో కలుపుకోవాలని మంత్రులను కోరుతున్నారు. పక్కనే ఉన్న కర్ణాకటలో రాయ్చూర్ జిల్లాలో శివరాజ్పాటిల్ అనే బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో అమలవుతున్న పథకాలు చేయాలని, లేకుంటే రాయ్చూర్ను తెలంగాణలో కలపాలని మీటింగ్లలో కోరుతున్నరు’ అని కేటీఆర్ అన్నారు.
‘ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రత్యేకమైన గౌరవం ఉంది. 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాను. అదే సమయంలో శాసనసభకు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజున చాలా ఇబ్బందుల్లో.. చాలాచోట్ల పోటి చేసినా పది మంది మాత్రమే గెలిచాం. మొదటి శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో తెలంగాణవాదులం, తెలంగాణ రావాలని కోరిక ఉన్నవాళ్లం కొంత నిరాశతో ఉన్నం. అసెంబ్లీ లాబీలో
రమణారెడ్డి కలిసి మాట్లాడుకున్నం. ఆ రోజు తెలంగాణ వద్దని ప్రచారం చేసిండో ఆయనను ప్రజలు గెలిపించారు.. మళ్లీ ఏం జరుగుతుందంటవ్ అని అడిగితే.. ఆ రోజు రమణారెడ్డి చెప్పిన మాట ఇవాళ నా చెవిలో ఇంకా మారుమోగుతున్నయ్. ఆ రోజు కాంగ్రెస్లో రమణారెడ్డి కాంగ్రెస్లో ఉన్న సమయంలో నేను టీఆర్ఎస్లో ఉన్న. తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజల కోరికలో న్యాయం, ధర్మం ఉన్నది.. న్యాయం-ధర్మం ఎప్పటికైనా గెలుస్తది. ఎప్పటికైనా తెలంగాణ వస్తది అని రమణారెడ్డి చెప్పారు. ఆ తర్వాత కొద్దిరోజులకు పార్టీ అధ్యక్షుడు నిరాహార దీక్షకు వెళ్లడం.. రాష్ట్రం మొత్తం ఉద్యమపథంలోకి ముందుకు దూసుకెళ్లిపోవడం ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్న విషయం తెలిసిందే’నని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
‘ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తిరుగుతూ మాట్లాడుతున్నడు. ఒక్క చాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటున్నడు. ఆయనకు, మీ అందరికీ గుర్తు చేస్తున్నా. 75 స్వాతంత్య్రం అనంతరం ఒక్కఛాన్స్ కాదు.. మన రాష్ట్రంలో పది చాన్స్లు ఇచ్చాం. 50 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మీటర్లు, అర్ధరాత్రి దొంగోలే వచ్చే కరెంటు.. దానికి కాపాలా కాసేందుకు వెళ్లి ఎవరు పాముకుట్టి చనిపోతారో తెలియదు. తేలుకట్టి, కరెంటు షాక్ తగిలి చనిపోతారో తెలియని పరిస్థితులుండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేగొండ, చెల్పూర్ మండలంలో ఓ పెద్ద మనిషి చనిపోతే కరెంటోళ్లకు ఫోన్ చేసిన బతిమిలాడుకున్న రోజులు గుర్తు చేసుకోండి.
మాకు దగ్గర మనిషి, చుట్టపాయన చనిపోయిండు 20 నిమిషాలు కరెంటియ్యి.. బాయికాడికోయి స్నానాలు చేయాలని అని వేడుకున్న రోజులను గుర్తుకు చేసుకోండి. మళ్లీ ఆ రోజులు కావాలా? పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కావాల్నా? మళ్లీ అలాంటి దిక్కుమాలిన పాలన కావాలా? ఇక్కడున్న యువత ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉందని గూగుల్లో కొడితే ఎక్కడ ఉంది? భూపాలపల్లి జిల్లాలో ఉందని అని గల్లా ఎగరేసి ఈ ప్రాంత బిడ్డలు ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు. మా తెలంగాణ గడ్డపై, మా భూపాలపల్లి జిల్లాలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టిండు.. 75 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చేయని పని చేసిండని భూపాలపల్లి బిడ్డలు గర్వంగా చెప్పుకునే పరిస్థితి కేసీఆర్ తీసుకువచ్చారు’ అన్నారు.