హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 : హైదరాబాద్ మహానగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి పౌర సన్మానం చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మూసీ ప్రాజెక్టుకో, నాలాల అభివృద్ధికో, ఇతర ఏ అభివృద్ధి పనులకైనా కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు తేవాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.103 కోట్లతో 8 చోట్ల చేపట్టే నాలా అభివృద్ధి పనులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిఫ్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్తో కలిసి బుధవారం కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఎల్బీనగర్ రింగ్రోడ్డులో రూ.18.07 కోట్లతో నిర్మించిన అండర్పాస్ను, బైరామల్గూడ చౌరస్తాలో రూ. 28.64 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో తమతో పోటీ పడాలని బీజేపీకి సవాల్ విసిరారు. చిన్న ప్రభుత్వమైన (రాష్ట్రప్రభుత్వం) మేం రూపాయి ఇస్తే, పెద్ద ప్రభుత్వమైన (కేంద్రం) రెండు రూపాయలు తేవాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధిలో పోటీ పడదాం
జీహెచ్ఎంసీలోని బీజేపీ కార్పొరేటర్లు చిల్లర రాజకీయాలు మాని, నగర అభివృద్ధిలో పోటీ పడాలని మంత్రి కేటీఆర్ చురకలంటించారు. ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు ఉండాలని, ఆ తర్వాత అభివృద్ధే ఎజెండాగా పనిచేయాలని స్పష్టంచేశారు. మంచి పనులతో ప్రజల మనస్సు గెలుచుకొనేందుకు పోటీ పడుదామని సూచించారు. ‘హైదరాబాద్ నగరం వరదల్లో మునిగితే సహాయ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వరద ముంపు శాశ్వత నివారణకు కేంద్రం నుంచి మీరు రూ.10 వేల కోట్లు తీసుకురండి. అప్పుడు కేంద్రం ఆదుకొన్నదని మీకే జేజేలు పలుకుతాం. అందరం కలిసికట్టుగా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేద్దాం’ అని పిలుపునిచ్చారు. త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తామని తెలిపారు.
నలువైపులా అభివృద్ధి
హైదరాబాద్ నగరాన్ని నలువైపులా ఒకే విధంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని నియోజకవర్గాలకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే అభివృద్ధి పనుల కోసం రూ.2,500 కోట్లు ఖర్చుచేస్తున్నామని వెల్లడించారు. రోడ్లు, పార్కులు, ఆటస్థలాలు, బస్తీ దవాఖానలు, తాగునీటి రిజర్వాయర్లు, నూతన పైపులైన్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. ఉప్పల్లో ఇటీవలే రూ.450 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. అందరికీ అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండేలా ఎల్బీనగర్ నియోజకవర్గంలో వెయ్యి పడకల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) నిర్మిస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ టిమ్స్ పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ ప్రాంతం ప్రజలు వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా, నిమ్స్కు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. 58, 59 జీవోల ద్వారా గతంలో లక్ష మంది పేదలకు భూ పట్టాలు ఇచ్చామని, మరోసారి ఆ జీవోలను అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పిదం వల్ల బీఎన్రెడ్డి నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో తలెత్తిన రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.