హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతుల పొట్టకొడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని, రైతులను దగా చేసే పార్టీ అని మండిపడ్డారు. హస్తం పార్టీ వైఖరిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
గురువారం ఈ మేరకు పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిపై ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రం, ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలపాలని ఆదేశించారు. కాంగ్రెస్ దిష్టిబొమ్మల దగ్ధం, ఇతర నిరసనలు చేపట్టాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించి కాంగ్రెస్ తీరును దుయ్యబట్టాలని వెల్లడించారు.
రైతుబంధు ఆపాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, రైతులను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ఇప్పటికే 11 పంట సీజన్లకు రైతులకు పెట్టుబడి సాయం అందించామని, కానీ ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతులకు సహాయం ఆపాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని వివరించారు. కోడ్ పేరు చెప్పి ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటును కూడా ఆపేయాలంటారా? అని ప్రశ్నించారు. అన్ని సంక్షేమ పథకాల్లో కేసీఆర్ కనిపిస్తారని, ఆ పథకాలన్నింటినీ ఆపాలని కాంగ్రెస్ అంటున్నదా? అని నిలదీశారు. పెట్టుబడి సాయాన్ని ఆపే కపట కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ రైతులు సహించరని స్పష్టం చేశారు.
రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలను ప్రజలు కట్ చేయటం పక్కా అని తేల్చి చెప్పారు. ఆ పార్టీ అన్నదాతల పాలిట నంబర్ వన్ విలన్ అని దుయ్యబట్టారు. ఇప్పటికే, నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులు అరిగోస పడుతున్నారని, తెలంగాణ రైతులకు, కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక 3 గంటల మోసానికి తెర తీశారని తెలిపారు. రైతుబంధును పాతరేసేలా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.