Minister KTR | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత విస్తరిస్తున్నదని, తెలంగాణ అభివృద్ధికి 9 ఏండ్లుగా నిర్మాణాత్మకంగా పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. బడ్జెట్ అంటే జమా లెక్కలు కావని, ప్రజల జీవనాడి అని పేర్కొన్నారు. పెట్టుబడ్డి వ్యయంలో తెలంగాణ టాప్గా నిలించిందని తెలిపారు. తమ ప్రభుత్వ లెక్కల్లో తప్పుంటే వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకే పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం, పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలపై అసెంబ్లీలో శనివారం కొనసాగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై కేటీఆర్ వివరణ ఇచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ప్రభుత్వం చేసిన వ్యయం, మౌలిక వసతుల కల్పనకు పెట్టిన పెట్టుబడులను గణాంకాలతో సహా వివరించారు.
కాంగ్రెస్ది భావదారిద్య్రం
మౌలిక వసతుల అంశం గంభీరమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో పరిపాలించినవాళ్లపై నేడు నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన బాధ్యత ఉన్నదని, కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు భావదారిద్య్రంలో ఉన్నారని విరుచుకుపడ్డారు. ‘తెలంగాణ పల్లెలు, పట్టణాలు బాగుపడుతున్నా, అవార్డులు వస్తున్నా కేవలం ఏదో విమర్శించాలి అనే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. ప్రగతిని ఓర్చుకోలేక ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. లేని సమస్యలను ఉన్నాయని, తమలోని అసంతృప్తిని ప్రజల్లో ఉన్నదని చూపే ప్రయత్నం చేస్తున్నారు. నిండిన చెరువుల్లోకి కప్పలు చొరబడినట్టు, పచ్చగా మారుతున్న తెలంగాణపై మళ్లీ ఒకరి తరువాత ఒకరు పాదయాత్రలతో కాంగ్రెస్ నేతలు చొరబడాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసే అభివృద్ధి ఏపీ సీఎం జగన్మోహరెడ్డికి అర్థమవుతున్నది.. అధికారమే పరమావధిగా వ్యవహరించే కాంగ్రెస్ వాళ్లకు తెలంగాణ సింగారం ఎన్నటికీ అర్థంకాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైర్డ్ (కాలంచెల్లినది). దానిని ప్రజలే పక్కన పెట్టారు. అదొక చచ్చిన పాము. అడ్డదిడ్డ వాదనలతో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. చిన్నపిల్లలకు ఎక్కాలు రావు.. ప్రతిపక్షాలకు లెక్కలు రావు.. భట్టి విక్రమార్క ఆరోపణల్లో అవాస్తవాలు లేవు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేముందు 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేశారో ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు. ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 2014లో అసెంబ్లీ వేదిక కాంగ్రెస్ పాలనపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఉటంకించారు.
కేసీఆర్ స్టేట్స్మెన్..
కాంగ్రెస్ పాలనలో శిథిలమైన తెలంగాణ నేడు సీఎం కేసీఆర్ పాలనలో శిఖరం వైపు పయనిస్తున్నదని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ‘ఏ ప్రాంతమైనా పురోగమనం దిశగా సాగాలంటే మౌలిక వసతులు అత్యవసరం. అందుకే ఉపాధి, ఉత్పాదకత పెంపునకు అవసరమైన మౌలికవసతుల కల్పన కో సం ప్రభుత్వం తెలంగాణ సోయితోని, దృక్పథంతో ని ఆలోచించి పనిచేస్తున్నది. కాం గ్రెస్వాళ్లు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారు.. కానీ కేసీఆర్ రాబోయే తరాలకోసం పనిచేస్తున్నారు. అందుకే కేసీఆర్ స్టేట్స్మెన్. మా పని నిర్మాణం, మా విధానం నిర్మాణాత్మకం. అందుకే ఒకవైపు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సాధిస్తూనే మరోవైపు మౌలిక వసతులకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నాం’ అని తెలిపారు.
బడ్జెట్ అంటే జీవనాడి..
రాష్ట్రంలో ప్రతిపక్షాలకు, ఇతర పక్షాలకు రాష్ట్ర బడ్జెట్ అంటే జమా ఖర్చుల పట్టిక. బీఆర్ఎస్ పార్టీ దృష్టిలో బడ్టెట్ అంటే ప్రజల జీవనాడి. మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇవ్వడంలేదన్న వాదన తప్పు. బడ్జెట్లో కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో పెట్టుబడి వ్యయం 15 శాతం. రాజస్థాన్లో 16 శాతమే. బడ్జెట్లో 26 శాతం నిధులను పెట్టుబడి వ్యయానికి వెచ్చిస్తూ తెలంగాణ రాష్ట్రం టాప్గా నిలిచింది.
సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్యం
అమెరికా ధనిక దేశం కావడం వల్ల అక్కడ రోడ్లు నంబర్వన్గా లేవని, రోడ్లు బాగుండటం వల్లే అమెరికా ధనిక దేశమైందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడి అన్న మాటను మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఆ మౌలిక సూత్రాన్ని అర్థం చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నదని వివరించారు. ‘సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధే తెలంగాణ నమూనా. నేను చెప్పేదాంట్లో తప్పుంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించండి. లేదంటే ప్రతిపక్ష పార్టీల డిపాజిట్లు గల్లంతు చేయండి’ అని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘తెలంగాణలో పల్లె మురిసింది. పట్టణాలు మెరుస్తున్నాయి. వ్యవసాయం బాగుపడుతున్నది. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. పల్లెల్లో హార్వెస్టర్లు.. పట్టణంలో ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారు. వైద్యారోగ్యరంగంలో నవశకం మొదలైంది. విద్యారంగం అపూర్వ విజయాలు సాధిస్తున్నది. ఐటీ రంగం దూసుకుపోతున్నది. పర్యావర ణం పరుగులు పెడుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో సంక్షేమం సముద్రమంత. అభివృద్ధి ఆకాశమంత’ అని కొనియాడారు. ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో సంక్షేమం ఉన్నదని, కేవలంలో కాంగ్రెస్ పార్టీలోనే సంక్షోభమున్నదని చురకలంటించారు.
బ్లాక్మెయిల్ రాతలకు భయపడబోం
కాంగ్రెస్ పార్టీ నేతలు సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. నీళ్ల కోసం రోజుకో ట్యాంకర్ తెచ్చుకొంటున్నామన్న భట్టి వ్యాఖ్యలు పూర్తి అవాస్తవమని కొట్టిపారేశారు. 2022 జనవరం నుంచి ఒక ట్యాంకర్ కూడా బుక్ చేయలేదని ఆధారాలతో సహా వివరించారు. భట్టి ఇంట్లో మీటర్ చెడిపోవడం వల్లే రూ.2.90 లక్షల నీటి బిల్లు చెల్లించాల్సి వచ్చిందని, మీటర్ పనిచేసి ఉంటే భట్టి ఇంటికి కూడా ఉచిత మంచినీటి పథకం వర్తించేదని తెలిపారు. ‘తెలంగాణ అస్తిత్వం, కేసీఆర్ అంటే గిట్టని కొన్ని పత్రికలు రాసిన కథనాలను సభలోకి తీసుకొచ్చి మాట్లాడటం హాస్యాస్పదం. బ్లాక్మెయిల్ రాతాలకు, ఆరోపణలకు తెలంగాణ ప్రభుత్వం భయపడదు. కేంద్రంలోని మోదీని ధిక్కరించాం. అదే తెలంగాణ దమ్ము. ఇకనైనా సదరు పత్రికల రాతలను అడ్డం పెట్టుకుని మాట్లాడవద్దు’ అని విపక్షాలకు హితవు పలికారు.
గుజరాత్ మాడల్ ఒట్టి డొల్ల
మిషన్భగీరథ పథకం సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పథకంపై అధ్యయనం కోసం గుజరాత్ వెళ్లామని, అక్కడ అంతా డొల్లని వివరించారు. ‘ప్రజలకు నీళ్లు తాపిస్తున్నాం. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాపిస్తాం. మిషన్ భగీరథ యజ్ఞంలో పని చేసినందుకు సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ పాలనలో 4,035 నల్లా కనెక్షన్లు ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం 24 వేల కనెక్షన్లు ఇచ్చింది. రాష్ట్రంలో కొత్తగా లక్షన్నర కిలోమీటర్ల పైపులైన్లు వేశాం. కాంగ్రెస్ హయాంలో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు 1,074 ఉంటే, నేడు ఒక్కటీ లేవు’ అని వెల్లడించారు.
పట్టణాలు ఆర్థిక ప్రగతి కేంద్రాలు
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ‘స్వపక్షం, ప్రతిపక్షం అని చూడకుండా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిధులు కేటాయించాం. మధిర మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, మంథనికి రూ.15 కోట్లు, సంగారెడ్డికి రూ.50 కోట్లు, సదాశివపేటకు రూ.55 కోట్లు, దుబ్బాకు రూ.30 కోట్లు, జమ్మికుంటకు రూ.40 కోట్లు, హుజూరాబాద్కు రూ.40 కోట్లు టీయూఎఫ్ఐడీయూసీ నుంచి వెచ్చించాం. ఇవే కాకుండా పట్టణ ప్రగతి కింద కూడా ప్రతిపక్ష నేతల పట్టణాలైన మధిరకు రూ.10.12 కోట్లు, మంథనికి రూ.4.73 కోట్లు, సంగారెడ్డి రూ.25.2 కోట్లు, సదాశివపేటకు రూ.12.93 కోట్లు, దుబ్బాకకు రూ.9.74 కోట్లు, జమ్మికుంటకు రూ.13.32, హుజూరాబాద్కు రూ.14.25 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారు’ అని వివరించారు.
పట్టణాలకు రూ.1,21,294 కోట్ల ఖర్చు
తెలంగాణలో పట్టణాభివృద్ధికి సీఎం కేసీఆర్ దృఢనిశ్చయంతో ఉన్నారని, కాబట్టే పురపాలకశాఖ ఆధ్వర్యంలో 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ సహా అన్ని పట్టణాలకు రూ.1,21,294 కోట్లను ఖర్చు చేసినట్టు మంత్రి కేటీఆర్ సభలో వెల్లడించారు. ‘2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ విడుదల చేసిన నిధులు కేవలం రూ.26,211 కోట్లు. కాంగ్రెస్ పానలలోకంటే నేడు బీఆర్ఎస్ పాలనలో 462 శాతం ఎక్కువగా నిధులు ఇచ్చాం. ప్రభుత్వం పదేండ్లలో ఖర్చు చేసిన మొత్తం రూ.1,21,294 కోట్లలో కేంద్రం వాటా రూ.9,934 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.1,11,360 కోట్లను రాష్ట్రప్రభుత్వం సొంత నిధులను వెచ్చించి అభివృద్ధి చేసింది. టీయూఎఫ్ఐడీయూసీ కింద అన్ని పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినం. సిరిసిల్లలో మాడ్రన్ మెకనైజ్డ్ ధోబీఘాట్ ఏర్పాటుచేశాం. ఇదే తరహాలో అన్ని మున్సిపాలిటీల్లో ఇటువంటి ధోబీఘాట్లను ఏర్పాటు చేస్తున్నాం.
నేడు రివర్స్ మైగ్రేషన్
కేంద్రం సహకరించకపోయినా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో 28 వేల చెరువులను బాగుచేసుకొన్నాం. 2,600 రైతు వేదికలు నిర్మించాం. 16 వేల నర్సరీలు ఏర్పాటు చేశాం. దేశంలో 30 శాతం అవార్డులు తెలంగాణ పల్లెలకే వచ్చాయి. దేశంలోనే ఉత్తమ జిల్లా పరిషత్గా ములుగు అవార్డు అందుకొన్నది. కాంగ్రెస్ 10 ఏండ్ల పాలనలో గ్రామాభివృద్ధికి పెట్టిన మొత్తం ఖర్చు రూ.6,142 కోట్లు. 9 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికి రూ.29 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. నీళ్లకోసం ఆనాడు. జానారెడ్డి దగ్గరికి వెళ్తే కన్నీళ్లు పెట్టించారు. 10 సార్లు ఓటు వేసినందుకు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను ఆగం చేసింది. ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమన్న దమ్మున్న నేత దేశంలో కేసీఆర్ ఒకరే. కాంగ్రెస్ 60 ఏండ్లలో చేయని పనులను 6 ఏండ్లలోనే చేసి చూపించాం’ అని పేర్కొన్నారు.
10 కాలాలపాటు నిలిచేలా కేసీఆర్ పథకాలు
రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తున్నారని కేటీఆర్ కొనియాడారు. ‘9 ఏండ్ల కేసీఆర్ పాలనలో పల్లెల రూపురేఖలు మారిపోయాయి. పల్లెలు సిరిమల్లెలు అయ్యాయి. ప్రతి ఊరిలో లక్ష కోట్ల సంపద సృష్టించాం. ప్రతి పల్లెలో భూమి బంగారమైంది. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా భూముల రేట్లు ఎకరాకు కనీసం రూ.20 లక్షలకు తక్కువ లేదు. సుస్థిరమైన, సమర్థ పాలన వల్లే ఇది సాధ్యమైంది. కరువు సీమలన్నీ కోనసీమలయ్యాయి. సినిమా షూటింగుల కోసం పల్లెలకు తరలివస్తున్నారు. ఇటీవల విడుదలైన బలగం సినిమానే అందుకు నిదర్శనం. దేశం నలుమూలల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారు’ అని తెలిపారు.
కేటీఆర్ పంచ్