రాజన్న సిరిసిల్ల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఒక్క అంశాన్ని కూడా కేంద్రం అమలు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసిరారు.
2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏపీ పునర్విభజన చట్టంలో ఎన్నో రకాల హామీలు, వాగ్దానాలు కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చింది. తెలంగాణకు సంబంధించినంత వరకు కచ్చితమైన, స్పష్టమైన వాగ్దానాలు చేసింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కొత్త విద్యా సంస్థలు ఇస్తామని, పారిశ్రామిక కారిడార్లు, రాయితీలు ఇస్తామని, ఇలా ఎన్నో రకాల వాగ్దానాలు పార్లమెంట్ సాక్షిగా చట్టంలో పొందుపరిచారు. సీట్ల సంఖ్య కూడా పెంచుతామని చెప్పారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇది మోదీకి చివరి బడ్జెట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎందుకంటే నేనేం శాపం పెట్టడం లేదు. ఈ ప్రభుత్వం మళ్లీ ఎన్నికలకు వెళ్లేలోపు 2024లో ప్రవేశపెట్టే బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్. దీనికి లెక్కాపత్రం ఉండదు. నిబద్ధత కూడా ఉండదు. వచ్చేవారు కొత్తగా పెట్టుకోవచ్చు. ఆ బడ్జెట్ను సవరించుకోవచ్చు. ఇప్పుడు పెట్టే బడ్జెట్కు మాత్రమే విలువ ఉంటుంది. కేంద్రానికి నిబద్ధత ఉంటే.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకునేందుకు ఇది చివరి అవకాశం అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చండి అని కేంద్రాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. 9 ఏండ్లలో తెలంగాణకు నయా పైసా పని చేయలేదు. తెలంగాణ సొమ్మును కేంద్రం వాడుకున్నది. 3 లక్షల 68 వేల కోట్ల రూపాయాలను కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కట్టారు. కేంద్రం తిరిగి రాజ్యాంగ బద్ధంగా, ఫైనాన్ష్ కమిషన్ సిఫారసు ఆధారంగా ఇవ్వాల్సిన 41 శాతం నిధులను, అంటే లక్షా 68 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ ప్రజల సొమ్ము, రక్తం, చెమటను ఇతర ప్రాంతాల్లో వాడుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వినియోగించారు. కానీ తెంలగాణకు వీసమెత్తు పని కూడా చేయలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు 8 ఏండ్లలో కొత్త రైల్వే లైన్, ప్రాజెక్టు మోదీ ప్రభుత్వం ఇవ్వలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు. ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రైల్వే లైనును పూర్తి చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే.. 8 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రంలో వేసిన రైల్వే లైన్ల పొడవు కేవలం 100 కి.మీ. కంటే తక్కువ. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోని, మేలుకొని తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద, కాజీపేట జంక్షన్లను నిర్వీర్యం చేస్తూ.. చాలా అన్యాయం చేశారు. ఈ బడ్జెట్లోనైనా తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలి. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా మేల్కొని కేంద్రాన్ని నిలదీయాలి. బడ్జెట్లో నిర్దిష్టమైన కేటాయింపులు వచ్చేలా చూడాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.