హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీజేపీకి వత్తాసుగా మాట్లాడితే ఊరుకోను అని రాహుల్ గాంధీ నిన్నటి వరంగల్ సభలో మాట్లాడిండు అని కేటీఆర్ గుర్తు చేస్తూ.. గాంధీ భవన్ను గాడ్సేకు అప్పజెప్పావని తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన నింపుకున్న వ్యక్తికి అప్పజెప్పావు. నీవు ఏం తెల్వనోనివి. రాసిస్తే చదివి పోయే వ్యక్తివి. అభం శుభం తెలియని అమాయకుడివి అజ్ఞానివి.. అంతకే ఉంటే మంచిదని రాహుల్ను కేటీఆర్ హెచ్చరించారు.
టీఆర్ఎస్ పార్టీకి బీజేపీతోని సంబంధం ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. మాకు ఇతర పార్టీలకు బీ టీమ్, సీ టీమ్ అయ్యే దౌర్భాగ్యం పట్టలేదు. మేం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే టీమ్. తొత్తులుగా ఉండే అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ పేరే స్కాంగ్రెస్. ఎ టు జడ్ అన్ని కుంభకోణాలే. ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టర్, స్పెక్ట్రమ్ నుంచి మొదలుకుంటే.. పాతాళంలో దొరికే బొగ్గు వరకు అన్ని కుంభకోణాలే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఓటుకు నోటు దొంగను పక్కను కూర్చొబెట్టుకొని రాహుల్ అవినీతి గురించి మాట్లాడితే సిగ్గు పోతుందని కేటీఆర్ అన్నారు. ఇదే సీఎం రాజు అయితే.. నీ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడే చిల్లర మాటలకు బయటే తిరిగేవాడా? యువరాజు అని నిన్ను పిలుస్తారు. నీ ముత్తాత మోతీ లాల్ నెహ్రూ నుంచి మొదలుపెడితే జవహర్ లాలా నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, తర్వాత నువ్వు.. రాజరికం మాదిరిగా ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చి రాజులు అని మాట్లాడటం సరికాదన్నారు. ఒక వేళ కేసీఆర్ నియంత అయితే.. పొద్దునే లేస్తే తిట్టుడు ప్రోగ్రామ్ పెట్టుకునే వారు ఇక్కడే ఉండేవారా? ఈ ఆటలు సాగుతాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్ను క్షమించం అని అంటడు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోం అని అంటుండు. ఈ దేశంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే వారు లేరు. అమేథిలోనే గెలవలేవు. నువ్వు తెలంగాణకు వచ్చి పీకి పందిరి వేస్తావా? అని రాహుల్ను కేటీఆర్ దుయ్యబట్టారు.