Pahalgam attack : పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack) కి సంబంధించిన దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లష్కరే తయ్యిబా (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను కీలక సూత్రధారిగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ దాడికి ఉగ్రవాదులను ఆదేశించడం దగ్గరి నుంచి కుట్రకు ప్రణాళిక రూపొందించడం, దాన్ని అమలు చేసేలా సయీద్ ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు ఆధారాలున్నాయని ఎన్ఐఏ పేర్కొంది.
పహల్గాం ఉగ్రదాడి కేసులో ఇప్పటికే 1597 పేజీల ఛార్జిషీట్ను ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. దీనికి అనుబంధంగా నేడు మరోసారి అభియోగపత్రాలను దాఖలు చేసింది. ఇందులో సీమాంతర ఉగ్రవాదం, హఫీజ్ సయీద్ పాత్ర, ఉగ్రవాదులకు పాకిస్థాన్ అండ వంటి అంశాలను పొందుపర్చింది. గత ఏడాది డిసెంబర్ 15న దాఖలైన తొలి ఛార్జిషీట్లో పాకిస్థానీ హ్యాండ్లర్ సాజిద్తో పాటు, 2025 జూలైలో జరిగిన ఆపరేషన్ మహాదేవ్లో భద్రతా బలగాలు హతమార్చిన ముగ్గురు ఉగ్రవాదులు, అరెస్టయిన ఇద్దరు నిందితుల గురించి ఎన్ఐఏ పేర్కొంది.
దాడిలో లష్కరే తయ్యిబా, దాని అనుబంధ సంస్థ అయిన టీఆర్ఎఫ్ సంస్థల పాత్ర గురించి అభియోగపత్రంలో చేర్చింది. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.