DGP CV Anand : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డ్రగ్స్ను నియంత్రించడం రాష్ట్రానికి అత్యంత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) అన్నారు. 2029 డిసెంబర్ నాటికి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం అవసరమని వెల్లడించిన డీజీపీ.. కేసుల దర్యాప్తు వేగవంతం చేసి కన్విక్షన్ రేటు పెంచాలని సూచించారు.
సీసీటీఎన్ఎస్ (CCTNS)లో పూర్తి స్థాయిలో డేటా అప్లోడ్ చేసి విచారణను వేగవంతం చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్పై దేశ దేశవ్యాప్తంగా ఈగిల్ పనిచేస్తుందని పేర్కొన్న ఆయన.. డ్రగ్స్తో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ఈ మధ్యలో థాయిలాండ్ వెళ్లేందుకు కూడా ఈగిల్ బృందానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం బస్ స్టాండ్లు, చెక్పోస్టులు, రైల్వే స్టేషన్లలో డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు ముమ్మరం చేయాలని డీజీపీ తెలిపారు.
అలానే సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయమని పేర్కొన్న డీజీపీ.. నేరాల నియంత్రణలో ఇదే నిబద్ధతతో ముందుకు సాగాలని జిల్లా పోలీసులకు సూచనలు చేశారు.