Minister KTR | ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్( Gas Cylinder ) ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ధ్వజమెత్తారు. తాజాగా కేంద్రం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల సిలిండర్ ధరను రూ. 50, కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 350 పెంచిందని గుర్తు చేశారు. అటు ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఈ రోజు ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణమన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన కానుక ఈ సిలిండర్ ధరల పెంపా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎల్లుండి అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సిలిండర్ ధరల పెంపుపైన నిరసన కార్యక్రమం చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎక్కడి వారక్కడ వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళా దినోత్సవం రోజున సైతం గ్యాస్ ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలన్నారు కేటీఆర్.
మోదీ అధికారంలోకి రాకముందు రూ. 400 ఉన్న సిలిండర్ ధర ఈ రోజు రూ. 1200లకు చేరుకుందని కేటీఆర్ గుర్తు చేశారు. పెరుగుతున్న సిలిండర్ ధరల కారణంగా ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. పెరుగుతున్న సిలిండర్ ధరలు, నిత్యవసర సరుకుల పెరుగుదల నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉన్నది. ఈ ధరల పెరుగుదల వలన ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని కేటీఆర్ తెలిపారు.
ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా… కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను పెంచుతున్న తీరును స్థానికంగా మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చూడాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ఉజ్వల స్కీం( Ujwala Scheme ) పేరుతో మాయమాటలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు భారీగా సిలిండర్ ధరలను పెంచుతున్నది. వారిని సిలిండర్కు దూరం చేస్తున్నది. ఉజ్వల స్కీంలో ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళా సైతం ఈరోజు సిలిండర్ను కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డగోలుగా సిలిండర్ ధరలను పెంచకుండా, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.