హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తరు. మోదీ, బోడీ, నీ ఈడీ మా వెంట్రుక కూడా పీకలేరు. ఏం చేసుకుంటవో చేసుకోపో. చావనైనా చస్తాం.. నీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తే లేదు. తప్పు చేయనోళ్లు ఎవరికీ భయపడరు. ఆరోపణలు మోదీ మీద వచ్చాయి. శ్రీలంక దేశంలో అక్కడి ప్రభుత్వ పెద్దలు, విద్యుత్ రంగ సంస్థ అధిపతి.. మోదీ మీద ఆరోపణలు చేశారు. రూ. 6 వేల కోట్ల కాంట్రాక్ట్ గౌతం అదానీకి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నీకు నీతి, సిగ్గు, మానం ఉంటే దాని మీద వివరణ ఇవ్వండి. అది వాస్తవమా? కాదా? చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలన్నారు.
దేశం ఒక వైపు పేదరికంలోకి పోతోంది. నిరుద్యోగం పతాక స్థాయికి చేరింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. 8 ఏండ్లలో మోదీ చేసిందేమీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పేదలున్న దేశంగా భారత్ మారింది. ధనవంతులే ధనవంతులుగా మారిపోతున్నారు. ఒక అదానీ, రాజగోపాల్ రెడ్డి ధనవంతులైతే ఈ దేశ ప్రజల భాగ్య రేఖలు మారిపోతాయా? అని ప్రశ్నించారు. మన తెలంగాణ మోడల్ను దేశానికి చూపేందుకే భారత్ రాష్ట్ర సమితి అని పెడుతున్నాం. బరాబర్ పరిచయం చేస్తాం. గుజరాత్ మోడల్తో దేశాన్ని గోల్మాల్ చేసినప్పుడు , బ్రహ్మాండంగా పని చేస్తూ, పేదవారికి అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, భారత్ రాష్ట్ర సమితి ఎందుకు కావొద్దు. ఇక్కడ ఎవరెవరో రాజకీయం చేయొచ్చు. కానీ తెలంగాణ వారు బయటకు వెళ్లి రాజకీయం చేయొద్దా? తెలంగాణకు చేసినట్లే.. దేశంలోని ఇతర ప్రాంతాలకు మన అభివృద్ధిని విస్తరిద్దాం. బలంగా గులాబీ జెండాను ఇతర ప్రాంతాల్లో నాటుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు.