KTR | వికారాబాద్ : ఎన్నికల్లో పోటీ అంటే సముజ్జీలతో ఉంటది.. రాజకీయ మరగుజ్జుగాళ్లతో కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. కేసీఆర్ ముందట వీళ్లు రాజకీయ మరగుజ్జులు, పిగ్మీలు. వీళ్లు పెద్ద సిపాయిలట.. వీళ్లు రాష్ట్రాన్ని నడుపుతారట.. మనం చూడల్నాట అని ప్రతిపక్షాలపై కేటీఆర్ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఒకప్పుడు డిగ్రీ కాలేజీ కోసం యుద్ధం చేసిన వికారాబాద్లో ఈ రోజు మెడికల్ కాలేజీ వచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన పిల్లలు వికారాబాద్లోనే డాక్టర్లు అయ్యే అద్భతమైన సౌలత్ వచ్చింది. వికారాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేసుకుని ఎన్నో దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. జిల్లా స్థాయి అధికారులందరూ ఇప్పుడు మీ దగ్గరరకు వచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రజల కళ్ల ముందు ఉంటే ఎమ్మెల్యేను ఎవరూ వదులుకోరు.. హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యేను కోరుకోరు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ పోటీ వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్యన. బీఆర్ఎస్ అభ్యర్థిగా మెతుకు ఆనంద్ వస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులెవరో తెలియదు. పోటీ కచ్చితంగా పార్టీలు, సిద్ధాంతాల మధ్యనే. ఎవరి వల్ల రాష్ట్రానికి మేలు అయితదో ఆలోచన జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఉప ఎన్నిక అయితేనేమో వ్యక్తుల మధ్య పోటీ. ఇది ఉప ఎన్నిక కాదు.. సార్వత్రిక ఎన్నిక. ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నిక. ఎవరు మన ముఖ్యమంత్రి కావాలి. ఎవరు ముఖ్యమంత్రి అయితే రైతులు బాగుంటారు, పేద మహిళలు బాగుంటారు. మన విద్యావిధానం బాగుంటుంది. ఇవన్నీ ఆలోచించి ఓటేయాల్సిన సందర్భం ఇది. ఆషామాషీగా ఓటేసే సందర్భం కాదు ఇది. ఎన్నికలు రాగానే మనోళ్లు ఆగమైతరు. ఎన్నికలు వచ్చిన వెంటనే సంక్రాంతికి గంగిరెద్దులు వాళ్లు వచ్చినట్లు కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు దిగుతారు. ఊదరగొట్టే ఉపన్యాసాలతో మీరు ఏది అడిగితే అది ఇస్తామని ఓటేయండి అని చెబుతారు. ఆకాశంలో ఉన్న చందమామను తీసుకొచ్చి వికారాబాద్లోనే, అనంతగిరి గుట్ట మీదనే కట్టేస్తామని చెబుతారు. ఆగం కాకండి.. ఆలోచించండి అని మంత్రి సూచించారు. మంత్రులు చేయలేని పనులను ఎమ్మెల్యే ఆనంద్ చేసి చూపించాడు. మెతుకు ఆనంద్ను 30 వేల మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామని ఆ రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అక్కడ ఏదో పొడిచినట్టు.. ఇక్కడ ఏదో డ్రామాలు ఆడుతున్నారు. ఒక వైపేమో చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ ఉన్నారు. ఇంకో వైపేమో రాజీనామా చేయమంటే పారిపోయిన సన్నాసి కిషన్ రెడ్డి, ఇంకోదిక్కు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ, థర్డ్ రేటు వెధవ రేవంత్ రెడ్డి ఉన్నాడు. వీల్లు మనకు పోటీనా.. పోటీ అంటే సముజ్జీలతో ఉంటది. రాజకీయ మరగుజ్జుగాళ్లతో కాదు.. కేసీఆర్ ముందట వీళ్లు రాజకీయ మరగుజ్జులు, పిగ్మీలు. వీళ్లు పెద్ద సిపాయిలట.. వీళ్లు రాష్ట్రాన్ని నడుపుతారట.. మనం చూడల్నాటా అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
మీరంత మగాళ్లయితే, సిపాయిలైతే మిగాతా రాష్ట్రాల్లో తెలంగాణ సాధించిన ఫలితాలను మీరు ఎందుకు సాధించడం లేదని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ తలసరి ఆదాయం భారతదేశంలో టాప్.. ఇది నేను చెప్పడం లేదు. మోదీ సంస్థ ఆర్బీఐ చెప్తున్నది. 3 లక్షల 17 వేలతో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పొచ్చు. మరి మీరు ఏం పీకారు. 27 రాష్ట్రాల్లో ఉన్నారు కదా..? ఎందుకు అయితలేదు.. నాయకత్వం లేక, తెలివిలేక. గుజరాత్లోనే ఏం చేయలేదు.. ఇక్కడ ఏం చేస్తరు. 75 ఏండ్లలో ఎవరన్న, ఏ ముఖ్యమంత్రి అయిన ఆలోచన చేసిండ్రా మంచినీళ్లు ఇవ్వాలని. ఇవాళ కేసీఆర్ మంచినీటి యుద్ధాలు ఆపారు. ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చారు కేసీఆర్. అలాంటి వ్యక్తిని పట్టుకొని.. రాక్షసానందం, పైశాచిక ఆనందం కోసం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం తప్ప.. మీరు చేసింది ఏంది..? ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఈ రెండు పార్టీలు చేసిందేమీ లేదని కేటీఆర్ మండిపడ్డారు.