KTR | వనపర్తి : కాంగ్రెస్ అంటే కన్నీళ్లు.. బీఆర్ఎస్ అంటే సాగునీళ్లు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీవి వారంటీ లేని గ్యారంటీలు అని, ఆ పార్టీ ఐసీయూలో ఉన్నదని విమర్శించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ పార్టీ స్కీమ్లు అమలు చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ స్కామ్లకు పాల్పడుతుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే మైగ్రేషన్, బీఆర్ఎస్ అంటే ఇరిగేషన్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే 24 గంటల కరెంటు పోయి.. 3 గంటల కరెంట్ రావడం ఖాయమన్నారు. నల్లా నీళ్లు కూడా బంద్ అవుతాయి.. ఆ నీళ్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
పాలమూరుకు వస్తున్న మోదీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 575 టీఎంసీలను కేటాయించాలన్నారు. మోదీకి తెలంగాణ అంటే ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. వాల్మీకీ బోయలకు ఎస్టీ హోదా కోసం రెండుసార్లు తీర్మానం పంపినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలను కేటీఆర్ కోరారు. కేంద్రంలో మన ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడొద్దన్నారు. కేంద్రంలో మనం ఉంటేనే మనకు రావాల్సిన హక్కులు వస్తాయన్నారు. గులాబీ జెండా ఎగిరే వరకు పాలమూరును పట్టించుకోలేదు. జిల్లాను దత్తత తీసుకున్నోళ్లు కూడా దగా చేశారు. జిల్లా నుండి 14 లక్షల మంది వలసపోతుంటే ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. నది పక్కన నేలలున్నా ఏ ప్రభుత్వం కూడా నీళ్లివ్వలేదు. ఆర్డీఎస్ తూములు పగులగొట్టి నీళ్లు తీసుకుపోతున్నా పట్టించుకోలేదు. అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే హారతులిచ్చి పంపించింది దగుల్బాజీ కాంగ్రెస్ నేతలే అని కేటీఆర్ మండిపడ్డారు.
వనపర్తి నియోజకవర్గంలో లక్షా 25 వేల ఎకరాలకు నీళ్లొచ్చాయంటే అది నిరంజన్ రెడ్డి ఘనత, కేసీఆర్ ఆశీస్సుల వల్లే సాధ్యం అయిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. డిగ్రీ కళాశాల కోసం ధర్నాలు చేసిన స్థితి నుండి వనపర్తికి మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు వచ్చాయని గర్వంగా గల్లా ఎగరేసి చెప్పొచ్చు. రూ. 180 కోట్లతో నూతన ఆసుపత్రిని నిర్మించారు. వనపర్తిని జిల్లా చేసి కలెక్టరేట్ నిర్మించారు. పీర్ల గుట్టలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు బంజారాహిల్స్ ఇండ్ల మాదిరిగా ఉన్నాయి. ఐటీఐ, కేజీబీవీ, వ్యవసాయ డిగ్రీ కళాశాలల నిర్మాణం జరుగుతుంది. ఇంటి పెద్దలా నిరంజన్ రెడ్డి వనపర్తిని అభివృద్ది చేస్తున్నారు. 65 ఏళ్లలో చేయని పనిని ఐదేళ్లలో చేసి చూపించారు. కేసీఆర్ కుడిభుజంగా తెలంగాణ జెండా ఎత్తి గ్రామగ్రామాన తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు అభివృద్దికి నిరంతరం కృషిచేస్తున్నారు. సిరిసిల్ల, సిద్దిపేట మాదిరిగా అత్యధిక మెజారిటీతో నిరంజన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని కేటీఆర్ కోరారు.