హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిలదీశారు. ‘దేశంలో నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్ఠస్థాయికి చేరుకున్నది. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి వెళ్లింది. ఇంధన ధరలు ఆల్టైం హై. ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికం. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లిందని ఆర్బీఐ చెప్తున్నది. మనం దీనిని ఎన్డీఏ ప్రభుత్వం అని పిలవాలా? లేదా ఎన్పీఏ ప్రభుత్వం అని పిలవాలా? మోదీ భక్తులారా తెలుసుకోండి.. ఎన్పీఏ అంటే (పనికిరాని ఆస్తి- నాన్ పర్ఫార్మింగ్ అసెట్)’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన నివేదికను విశ్లేషిస్తూ ఆంగ్ల పత్రికలు రాసిన రెండు కథనాలను కేటీఆర్ తన ట్వీట్కు ట్యాగ్చేశారు. కేటీఆర్కు మద్దతుగా నెటిజన్లు కేంద్రంపై విరుచుకుపడ్డారు. పేదలు ఆకలితో అలమటిస్తుంటే, భారత్ మాతాకీ జై అంటావా? లేదా? అని మోదీ అడుగుతున్నట్టు ఉన్న కార్టూన్లు పెట్టారు. హిందూ, ముస్లింల మధ్య గొడవలు పెట్టడంలో, మతకల్లోలాలను పెంచడంలో మోదీ ప్రభుత్వం బిజీగా ఉన్నదని మరొకరు పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు, ప్రజల ఆదాయం, పెరుగుతున్న ధరల గురించి ప్రధాని మోదీ మన్కీ బాత్లో ఎందుకు మాట్లాడటం లేదంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు. ధరల పెరుగుదలపై ఆసక్తికరమైన కార్టూన్లను పోస్ట్ చేసి మంత్రి కేటీఆర్కు మద్దతు ప్రకటించారు.
అమిత్షాజీ ఢిల్లీ పోలీసులపై దౌర్జన్యాన్ని సహిస్తారా?
ఢిల్లీ పోలీసులపై యుద్ధం చేస్తామంటూ వీహెచ్పీ నేత బెదిరించడంపైనా మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ దౌర్జన్యాన్ని మీరు ఎలా సహిస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్షాను ట్వీట్లో ప్రశ్నించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్పురిలో అనుమతి లేకుండా ప్రదర్శన చేసిన విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) నాయకుడు ప్రేమ్ శర్మపై అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
దీనిపై వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వీహెచ్పీ, బజరంగ్దళ్ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు పెద్ద తప్పు చేశారంటూ మండిపడ్డారు. మా కార్యకర్తలపై ఏదైనా చర్య తీసుకొంటే ఢిల్లీ పోలీసులపై యుద్ధం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్షాను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘వీళ్లు ఐపీసీ, దేశ చట్టానికి అతీతులా హోం మంత్రి అమిత్షా జీ? మీకు నేరుగా నివేదించే ఢిల్లీ పోలీసులపై దౌర్జన్యాన్ని మీరు సహిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు.