KTR | నిజామాబాద్ : రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిపాజిట్ గల్లంతు ఖాయం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారు. నీవు ఎక్కడ పోటీ చేసినా నీ డిపాజిట్ గల్లంతు చేయడం ఖాయమని కేటీఆర్ తేల్చిచెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
ఇవాళ పట్టణాలు, పల్లెలు బ్రహ్మాండంగా బాగుపడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. గత 60 ఏండ్ల కాలంలో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ హబ్లు రాలేదు. కానీ ఇవాళ జిల్లా కేంద్రాలకు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే.. కొంతమందికి ఇవాళ మనసున పడుతలేదు. ప్రజలు సంతోషంగా ఉంటే.. వారు ఆగమాగం అవుతున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు. చదువుకున్నాడో లేదో తెలియదు కానీ.. ఎంత కుసంస్కారంగా, ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారో మీరే చూస్తున్నారు. కేసీఆర్ వయసు వారి నాన్న వయసు. మేం డీఎస్ను అనలేమా..? మాకు మాటలు రావా..? మాకు చేతకాదా..? కానీ పెద్ద మనషులను గౌరవించుకోవడం హిందూ సంప్రదాయం. అంతే కాదు మనిషి నాగరికతకు చిహ్నం కూడా. కానీ 70 ఏండ్ల వయసున్న కేసీఆర్ను పట్టుకుని, ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ను పట్టుకొని.. నిన్నమొన్న ఎంపీ అయినోడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఆ ఎంపీకి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇకనైనా సంస్కారవంతంగా మాట్లాడటం నేర్చుకో. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారు. నీవు ఎక్కడ పోటీ చేసినా నీ డిపాజిట్ గల్లంతు చేయడం ఖాయం అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెల్లారిలేస్తే చిల్లర మాటలు చిల్లర పంచాయతీలు చేస్తున్నారంటూ అరవింద్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూవులు, ముస్లింలు ఇది తప్ప మరొకటి రాదు. మతల మధ్య పంచాయతీ పెట్టే పిచ్చి మాటలు తప్ప ఒక్క మంచి మాట రాదు. ఇన్ని వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతుంటే.. పార్లమెంట్ సభ్యుడికి చిత్తశుద్ధి ఉంటే రాడా..? వచ్చి మాతో పాటు నిలబడడా..? ఎందుకు ముఖం లేదా..? నయా పైసా పని చేయలేదు కాబట్టి.. నీ మోడీ బోడీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు కాబట్టి.. ఇవాళ వచ్చేందుకు ముఖం లేక.. ముఖం చాటేసి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఐటీ హబ్, న్యాక్, చెరువుల అభివృద్ధి కనిపించడం లేదా? ఇక్కడి ప్రజలు బాగుపడితే చూడబుద్ది అయితలేదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
మోదీ అధికారంలోకి వచ్చాక మతకల్లోలాలు పెరిగాయని కేటీఆర్ తెలిపారు. సిలిండర్ ధరలు పెరిగాయి. ఉద్యోగాల భర్తీ జరగలేదు. బీజేపోడు ఎవడైనా వస్తే గుండుకొట్టి.. డిపాజిట్లు గల్లంతు చేసి మోదీకి బుద్ధి చెప్పాలి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా పెట్రోల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. రూ. 70 ఉన్న పెట్రోల్ను రూ. 110 చేశాడు. పెట్రోల్ ధరలు పెంచడంతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయి. పిరపమైన ప్రధానమంత్రి మోదీకి మీ ఓటుతోనే సమాధానం చెప్పాలి. బీజేపీ పార్టీని గల్లీలో గల్లా పట్టి నిలదీయాలి. హిందూ, ముస్లిం అని పంచాయతీలు పెట్టడం తప్ప నీవు ఏం చేసినవ్ ఈ 9 ఏండ్లలో. ఒక్క మంచి పనైనా నిజామాబాద్కు చేశావా అని ఎంపీని నిలదీయాలి. చైతన్యవంతమైన నిజామాబాద్ ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు.