రాజన్న సిరిసిల్ల : పచ్చని పంటపొలాలను చూస్తుంటే ప్రతిపక్షాలకు కడుపు మండుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మర్రిపల్లిలో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
75 ఏండ్ల స్వాతంత్ర్య భారత్లో రైతుల కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు ఈ ప్రాంతంలో జీవన విధ్వంసం జరిగిందన్నారు. రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రైతు బంధు పథకం కింద 62 లక్షల మంది రైతులకు ఏడాదికి రూ. 15 వేల కోట్లు ఇస్తున్నామని తెలిపారు. రైతుల లాభనష్టాలు… మీ ఆలోచనలు పంచుకునేందుకు ఈ రైతు వేదిక ఒక చక్కని వేదిక అవుతుందన్నారు. ధాన్యం నిల్వ చేసుకునే గోదాములు కూడా పెంచుకున్నామని చెప్పారు.
దేశంలో ఒక్క రాష్ట్రంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. దేశంలో ఇంతకంటే మంచి పథకాలు ఎక్కడైనా ఉంటే మేము రాజీనామా చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏ చర్చకైనా మేం సిద్ధం అని సవాల్ విసిరారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి ఆయన పార్లమెంటు పరిధిలోని వేములవాడకు రూ. వంద కోట్లు తెచ్చే తెలివి లేకుండా పోయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఏది పడితే అది అడ్డంగా మాట్లాడితే చెల్లుబాటు కాదన్నారు. కులం పిచ్చి.. మత పిచ్చి పేరుతో రెచ్చగొడుతూ.. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు… కల్లబొల్లి మాటలు నమ్మకండి.. ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే బీజేపీ నాయకులను నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.