హైదరాబాద్ : తెలంగాణలో అసమర్థ ప్రభుత్వం ఉందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఎవరిది అసమర్థ ప్రభుత్వం అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
గుజరాత్ సీఎంగా మోదీ మూడుసార్లు గెలిచారు. అక్కడ తాగునీటికి ఇబ్బందులున్నాయి. ఎవరు అసమర్థుడు? ఎవడు దద్దమ్మ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్లో నీళ్ల కోసం ఆడబిడ్డలు ఎర్రటి ఎండలో నిలబడ్డారు. మా చేతకాని ప్రధాని, సీఎం వల్ల నీటి సమస్యపై ఏర్పడిందని ఓ గుజరాత్ ఎమ్మెల్యే కూడా లొల్లి పెట్టినట్లు వార్తలు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇవి నేను చెప్పడం లేదు. టైమ్స్ నౌ అనే జాతీయ మీడియా ప్రచురించిందని కేటీఆర్ తెలిపారు. మూడు సార్లు సీఎం, రెండు సార్లు ప్రధానివి అయినా నిన్ను ఏమనాలి.. చేతకాని వాడివి అనలా? దద్దమ్మా అనలా? పనికొచ్చేటోడు అనాలా..? ఏమనాలి అని కేటీఆర్ అడిగారు.
గుజరాత్లో పరిశ్రమలకు వారంలో ఒక రోజు కరెంట్ బంద్. కరెంట్ సమస్యతో రోడ్ల మీదకెక్కిన రైతులకు 15 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి చెప్పిండు. మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లోనూ కరెంట్ సమస్యలున్నాయి. ఉత్తరప్రదేశ్లోనూ విద్యుత్ కోతలు ఉన్నాయి. మరి ఎవరు అసమర్థులు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా.. మరి డబుల్ ఇంజిన్ ఏం పీకింది. మరి సింగిల్ ఇంజిన్ ఉన్న తెలంగాణలో కరెంట్ వస్తది. డబుల్ ఇంజిన్ ఉన్న రాష్ట్రాల్లో మన్ను కూడా లేదు. డొల్ల మాటలు తప్ప ఏం లేదు. మీ ఇంజిన్లు ఏం సాధించాయని నిలదీశారు.
ఎనిమిదేండ్ల తర్వాత కరెంట్ ఛార్జీలు 50 పైసలు పెంచితే.. ఏదో జరిగినట్టు రాష్ట్ర బీజేపీ నేతలు వాగ్వాదం చేస్తున్నారు. వారేమో ఇంధన ధరలు 20 సార్లు పెంచుతరు. 50 పైసలు పెంచితే నానాయాగి చేస్తరు. గుజరాత్లో గత ఐదు నెలల్లో 4 సార్లు కరెంట్ ఛార్జీలు రూ. రెండున్నర పెంచారు. సామాన్యుడికి సచ్చే దిన్.. మోదీ మిత్రులకు అచ్చేదిన్ వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.