Donald Trump : అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇరాన్పై బుధవారం రాత్రి భారీ దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సైనిక చర్య కూడా తప్పదన్నారు. టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో సదస్సులో పాల్గొన్న ట్రంప్.. ఇరాన్తో తాజాగా నెలకొన్న ఘర్షణ పరిస్థితులపై మాట్లాడారు. ‘‘గత రాత్రి ఇరాన్పై దాడిచేశాం. ఈ రోజు రాత్రి మరింత భారీ దాడికి దిగుతాం. ఒకవేళ ఇరాన్ చర్యలు ఇలాగే కొనసాగితే అక్కడి పౌర నిర్మాణాలపై కూడా విరుచుకుపడుతాం.
ఖర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకుంటాం. హార్ముజ్ జలసంధిని మరోసారి దిగ్బంధిస్తాం. ఇరాన్ నౌకల్ని ధ్వంసం చేస్తాం’’ అంటూ ట్రంప్ హెచ్చరించారు. అంతకుముందు కూడా ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్తో కాల్పుల విరమణ ముగిసిందన్నారు. అంతేకాదు.. గతంలో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇరాన్తో ఒప్పందానికి ఇక విలువ లేదని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నేతలకు చిత్తశుద్ధి లేదన్నారు. వారు మోసగాళ్లు, అబద్ధాలకోరులు అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పటికే ఇరాన్పై జరిపిన దాడుల్లో 28 ఇరాన్ నౌకల్ని అమెరికా దళాలు ధ్వంసం చేశాయని ట్రంప్ తెలిపారు. ఈ రోజు ఇంకొన్ని నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటామని, అవసరమైతే విద్యుత్ సదుపాయాలు, నీటి సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.
కొద్ది రోజులుగా శాంతి నెలకొన్న పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం తలెత్తింది. రెండు దేశాలు దాడులకు తెగబడ్డాయి. బహ్రెయిన్, కువైట్లోని అమెరికాకు చెందిన 85 బేస్లపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. దీనికి బదులుగా హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, నౌకలు, సముద్ర నిఘా వ్యవస్థలపై అమెరికా దాడి చేసింది. అయితే, అమెరికా బెదిరింపులకు తాము భయపడబోమని ఇరాన్ ప్రకటించింది.