హైదరాబాద్ : ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 50కే చీప్ లిక్కర్ అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీ బీజేపీ నేతలు మరింత దిగజారిపోయారని, వావ్.. వాట్ ఏ స్కీం వాట్ ఏ షేమ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రూ. 50కే చీప్ లిక్కర్.. బీజేపీ జాతీయ విధానామా? అని ప్రశ్నించారు. అధికారంలోని లేని రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏపీలో బీజేపీని గెలిపిస్తే రూ. 50కే చీప్ లిక్కర్ ఇస్తామని వీర్రాజు.. విజయవాడలో నిన్న నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహ సభలో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి, గెలిపిస్తే రూ. 75కే చీప్ లిక్కర్ విక్రయిస్తాం. ఆదాయం ఇంకా బాగొస్తే రూ. 50కే చీప్ లిక్కర్ ఇస్తామని వీర్రాజు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏపీలో నాణ్యమైన లిక్కర్ను విక్రయించడం లేదని, కల్తీ మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నాణ్యమైన చీప్ లిక్కర్ కోసమైనా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయాలని వీర్రాజు కోరారు.