రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ పదం ఉండేదా? ఈ రాష్ట్రం వచ్చి ఉండేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రోడ్ల మీద తిరుగుతూ ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. సోమవారం, మంగళవారం అంటూ రాజకీయం చేయొద్దని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ లేకపోతే ఇప్పుడు మాట్లాడేవారికి పదవులు వచ్చి ఉండేవా తెలంగాణ వచ్చిన తర్వాత కొందరు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కేంద్రం పైసలతోనే రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయంటే.. మరి మోదీ పైసలయితే దేశమంతా అభివృద్ధి కావాలి కదా? దేశంలోని 6 లక్షల పల్లెల్లో ఇలాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయా? తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా లేవు. అభినందించాల్సింది పోయి అక్కసు వెళ్లగక్కడం సరికాదని కేటీఆర్ సూచించారు. అడ్డమైన మాటలు మాట్లాడం ఆపి అభివృద్ధిలో పోటీ పడాలి. దమ్ముంటే కరీంనగర్ పార్లమెంట్కు ఒక వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని బండి సంజయ్కు కేటీఆర్ సవాల్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం బండలింగంపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో రూ.28 లక్షలతో నిర్మించనున్న ఆధునిక భవన నిర్మాణం, నూతన మౌలిక సదుపాయాల కల్పన పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నాం. మే నెల వచ్చిందంటే మంచి నీళ్ల కోసం బిందెలతో నిరసన వ్యక్తం చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంటింటికీ సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. కరెంట్కు, మంచినీళ్లతో పాటు సాగునీటికి ఢోకా లేదు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకుండే. ఎండకాలంలో మానేరు మత్తడి దుంకే అవకాశం రాకుండే అని కేటీఆర్ పేర్కొన్నారు.
మన రాష్ట్రంలో ఉండే పేదలను కడుపులో పెట్టి చూసుకునేందుకు పెన్షన్లు పెంచుకున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేసి పేదింటి ఆడబిడ్డలను ఆదుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు అయిన వారికి కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం. గురుకులాల్లో నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నాం. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేవారికి ఓవర్సీస్ స్కాలర్షిప్ లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
దేశమంతా చీకట్లో ఉంటే.. తెలంగాణలో మాత్రం 24 గంటల పాటు కరెంట్ వెలిగిపోతోంది. భవిష్యత్ తరానికి మంచి చేసే యజ్ఞం మన ఊరు – మన బడి కార్యక్రమం అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మూడేండ్లలో ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.