Minister KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఒక్క నిరుద్యోగికి కూడా అన్యాయం జరగనివ్వమని బీఆర్ఎస్( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( KTR ) స్పష్టం చేశారు. ఉద్యోగార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదని గ్రూప్ -1 ప్రిలిమ్స్( Group -1 Prelims ) పరీక్షను రద్దుచేయాలని టీఎస్పీఎస్సీ( TSPSC ) కీలక నిర్ణయం తీసుకుందని కేటీఆర్ తెలిపారు. ఇది బాధాకరమైన నిర్ణయం అయినప్పటికీ తప్పలేదని.. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఒకవైపు ప్రభుత్వం స్పందించిన పారదర్శక తీరును పట్టించుకోకుండా కేవలం మొత్తం వ్యవహారాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని దుర్మార్గమైన ప్రయత్నాన్ని బీజేపీ మానుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. ప్రతిసారి తమ స్వార్ధ రాజకీయాలకు సమాజంలో చిచ్చుపెట్టే అలవాటు బీజేపీకి కొత్త కాదని, ఈ వ్యవహారాన్ని సైతం బీజేపీ శాంతి భద్రతల సమస్యగా మార్చే కుట్ర చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలోని యువకులు, విద్యార్థులు టిఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మరొకసారి కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే మా ప్రభుత్వం ఇచ్చిన హామీ కన్నా రెండింతలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువత పట్ల తన నిబద్ధతను చాటుకున్నదన్నారు. తెలంగాణ యువతకే 95 శాతం ఉద్యోగాలు దక్కాలన్న సమున్నతమైన ఆశయంతో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిందని, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మంత్రి తెలిపారు.
ఒక వ్యక్తి వలన జరిగిన దురదృష్టకరమైన సంఘటన బాధాకరమన్నారు కేటీఆర్. ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క ఆరోపణ లేకుండా వేలాది ఉద్యోగాలు భర్తీచేసిన మన పబ్లిక్ సర్వీసు కమిషన్ యూపీఎస్సీతోపాటు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఒక్క నిరుద్యోగికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇస్తున్నామన్నారు. అయితే ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న కుటిల రాజకీయ పార్టీల అసలు నైజాన్ని, మొసలి కన్నీరుని గుర్తించి చైతన్యంతో వ్యవహరించాలని విద్యార్థికి, యువతకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా, అవసరమైన కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వం రాష్ట్ర యువత ప్రయోజనాలు కాపాడటం కోసం అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తుందని, వారిపట్ల తమ నిబద్ధతను గుర్తించాలని కేటీఆర్ కోరారు.