KTR | రాజన్న సిరిసిల్ల : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి.. మల్లన్నసాగర్ను నింపి, కూడవెల్లి వాగు ద్వారా మన బీళ్లకు మళ్లుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నెత్తరు బారిన ఈ నేలలో నీళ్లు పారుతున్నాయి. కన్నీళ్లు కారిన ఈ నేలలో సాగు తాగునీరు పుష్కలంగా వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో కలలో కూడా ఊహించని సంక్షేమం, అభివృద్ధి జరిగిందని కేటీఆర్ తెలిపారు. అంతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి జరుగుతోంది. మన కండ్ల ముందు కనబడుతుంది. అప్పర్ మానేరు మత్తడి దుంకుతున్నది అంటే దానికి కారణం కేసీఆర్. సిరిసిల్ల నేతన్నల జీవితాలు, బతుకులు మారాయి. ఇది నేతల, చేతల, చేనేతల ప్రభుత్వం. సిరిసిల్ల ఇవాళ కలలో ఊహించని విధంగా జిల్లా అయింది. 90 కిలోమీటర్ల పోయే బాధ తప్పింది. మన సిరిసిల్లలోనే కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులందరూ కొలువుదీరారు. ఇవాళ జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది. ఇంజినీరింగ్ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీతో పాటు అన్ని విద్యాసంస్థలు ఇచ్చారు. కేజీ టు పీజీ విద్యను కూడా ఇక్కడే మొదటిసారిగా ప్రారంభించారని కేటీఆర్ తెలిపారు.
జిల్లాలో ఆరున్నర మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. ఐఏఎస్ అధికారుల శిక్షణలో సిరిసిల్ల గురించి చర్చ జరుగుతుంది. సిరిసిల్లకు అడగకుండానే అన్ని ఇచ్చారు. మా ఆడబిడ్డల ఆధారాభిమానంతో, అన్నదమ్ముళ్ల ఆశీర్వాదంతో తప్పకుండా మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తాం. మీ నాయకత్వానికి మళ్లీ సిరిసిల్ల జై కొడుతుంది. హ్యాట్రిక్ సీఎం కోసం సిరిసిల్ల ప్రజలు ఆశీర్వాదం ఇస్తారు. మీ ప్రేమ, ఆశీర్వాదం భవిష్యత్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాను అని పేర్కొంటూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.