Minister KTR | నర్సాపూర్ రోడ్షోకు హాజరైన జనాలను చూస్తుంటే సునీతా లక్ష్మారెడ్డి విజయం ఖాయమైందని.. ఈ దెబ్బతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మిడిల్ డ్రాపేనని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కేటీఆర్ ఆదివారం బీఆర్ఎస్ సునీతా లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఎవరైనా ఇంట్లో చనిపోతే అంత్యక్రియల స్నానాలకు విద్యుత్ ఎలా ఉండేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మూడు గంటలు విద్యుత్ చాలంటున్నాడని.. కోమటి రెడ్డికి కరెంట్ కనబడత లేదంటున్నాడన్నారు.
రెండు ఏసీ బస్సులను కట్టి కాంగ్రెస్ పెద్దలను తీసుకెళ్లి కరెంటు తీగలను పట్టుకోమందామన్నారు. ప్రజలకు ఒకే ప్రశ్న అని.. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా ? తేల్చుకోవాలన్నారు. భూమిని కౌలుకిస్తే రైతుకు రైతుబంధు ఇవ్వమని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నాడని విమర్శించారు. ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ పెద్దలు అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. కొడంగల్ వెళ్లినప్పుడు అక్కడ తేలిపోయిందన్నారు. రేవంత్రెడ్డి కొడంగల్లో కామారెడ్డిలో చిత్తుగా ఓడిపోతున్నాడన్నాడు.
2014లో నరేంద్ర మోదీ రూ.15లక్షలు అకౌంట్లో వేస్తామని అన్నమాట ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.800 భరించుకొని.. రూ.400కే సిలిండర్ ఇస్తాడన్నారు. కేసీఆర్ భూములు గుజుంకుంటడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలను ఇస్తామన్నారు. ధర్మయుద్ధంలో గెలువలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నర్సాపూర్లో ఐటీ హబ్, పరిశ్రమలను స్థాపిస్తామని హామీ ఇచ్చారు. వెయ్యి శాతం వచ్చేది బీఆర్ఎస్దేనన్నారు. అధికారంలోకి వచ్చాక నర్సాపూర్ను సిరిసిల్ల నుంచి చార్మినార్ జోన్లోకి కలుపుతామన్నారు. సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని.. ఎమ్మెల్యే మదన్రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.