రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేంద్రానికి పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా? అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు. తెలంగాణలో నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించామని, అలాగే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలని మోదీ సర్కారును డిమాండ్ చేశారు. చీటికి మాటికి తెలంగాణకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా, రాష్ర్టానికి రూ.10 వేల కోట్లు ఎన్నడైనా తెచ్చావా? అని ప్రశ్నించారు. తెలంగాణ చెమట, రక్తంతో కష్టించి కట్టిన పన్నుల సొమ్మును, ఉత్తరప్రదేశ్, గుజరాత్ కోసం ఖర్చుపెడుతున్నారని విమర్శించారు. సొమ్ము ఒకడిది.. సోకు కేంద్రానిది అంటూ మండి పడ్డారు. మోదీ పాలనలో మన దేశం నైజీరియా కంటే పేద దేశంగా మారిందని విమర్శించారు.
దేశాభివృద్ధి సంగతి మరిచి యువతలో మత విద్వేష బీజాలు నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీం ఇండియా, సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పనిచేద్దామని మోదీ చెప్తున్న అందమైన మాటల వెనుక అంతా మోసమే ఉన్నదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు పోటీగా సమావేశాలు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణపై దండయాత్రకు వచ్చినట్టు ఇద్దరు సీఎంలు, కేంద్ర హోం మంత్రి వస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, వేములవాడ పట్టణంలోని గుడి చెరువు మైదానంలో శుక్రవారం నిర్వహించిన సభల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. 50 మంది కొత్త పెన్షన్దారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతపిచ్చిగాళ్ల మాయలో పడితే దశాబ్దాల పాటు తెలంగాణ వెనుకకు పోతుందని, వారి నుంచి జాగరూకతతో ఉండాలని హెచ్చరించారు. ‘కేసీఆర్ను జైలుకు పంపుతామంటున్నారు. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? రైతులు, అన్ని వర్గాలకు మేలు చేసినందుకు కేసీఆర్ను జైల్లో పెట్టాలా?’ అని బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.
మా పథకాలు మీ రాష్ర్టాల్లో అమలు చేయండి
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసే దమ్మున్నదా? అని కేటీఆర్ సవాల్ చేశారు. ఏ కారణం చేతనైనా రైతు, నేత కార్మికుడు చనిపోతే.. ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇచ్చి ఆదుకొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రైతుబంధు ద్వారా 62 లక్షల మంది రైతున్నలకు కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో రూ.58 వేల కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ‘రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్ష, డబుల్బెడ్ రూం ఇండ్లు కట్టించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. కులవృత్తుల వారికి, అణగారిన వర్గాలకు చేరువవుతున్న ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చేయాలన్న కుట్ర తప్ప.. బీజేపీకి మరో ఆలోచన లేదు’ అని ధ్వజమెత్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరానికి కేంద్రం నుంచి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదు? అని బీజేపీ నేత బండి సంజయ్ని నిలదీశారు. ఎంపీగా గెలిచి నాలుగేండ్లయినా జిల్లాకు నయాపైసా తేలేదు, మెడికల్ కళాశాల, నవోదయ పాఠశాలలు అయినా తెచ్చారా? అని బండి సంజయ్పై విరుచుకుపడ్డారు. కేంద్రానికి రూపాయి పన్ను కడితే.. తెలంగాణకు తిరిగి నలభై పైసలు మాత్రమే వాపస్ వచ్చాయని చెప్పారు. ‘ప్రధాని మోదీ తన నియోజకవర్గంలోని కాశీని అభివృద్ధి చేస్తానంటున్నారు. హిందువునంటూ బట్టలు చింపుకొంటున్న బండి సంజయ్.. దక్షిణ కాశీ అయిన వేములవాడకు ఒక్కపైసా కూడా ఎందుకు తేలేదు? శవం వస్తే మీది.. శివం వస్తే మాది అని చిల్లర, బక్వాస్ మాటలు మాట్లాడుతున్నారు. తవ్వుదాం.. బరాబర్ తవ్వుదాం.. బీడు భూములు, కాల్వలు, పేదలకు ఇండ్ల కోసం పునాదులు తవ్వి బంగారు తెలంగాణను చేద్దాం’ అని అన్నారు. 1968లో తెలంగాణ కోసం 371 మంది పిల్లలు బలిదానం చేశారని, 2001 నుంచి 2014 వరకు జరిగిన పోరాటంలో వందల మంది ఆత్మబలిదానాలతో ఢిల్లీని కదిలించేలా చేశారని కొనియాడారు. అమరులకు కేటీఆర్ జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్హెగ్డే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం మూడు రోజులపాటు వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తుంటే, కొందరు పోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పక్క రాష్ర్టాల మంత్రులు వచ్చి ఏం సందేశం ఇవ్వదలుచుకొన్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పోటీగా కార్యక్రమాలు పెట్టి, లేని పోని విద్వేషాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పచ్చగా ఉన్న తెలంగాణలో మతం పేరుతో చిచ్చుపెడుతున్న నరేంద్రమోదీ, ఈ దేశాన్ని ఏం చేయాలనుకొంటున్నారని నిలదీశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక హోం మంత్రిని పంపి పోటీ సమావేశాలు పెట్టి రాజకీయంగా చిచ్చుపెట్టి, నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని చిల్లర ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ‘తెలంగాణ సాయుధ పోరాటంలో మీ పాత్ర ఏమైనా ఉన్నదా? మీ పార్టీ పాత్ర ఉన్నదా? ఎగిరెగిరి పడుతున్న నాయకుల పాత్ర ఉన్నదా? స్వయంగా మా కుటుంబానికి అనుబంధం ఉన్నది. బోయినిపల్లి మండలంలోని కొదురుపాక మా తాతగారి ఊరు. మా తాత 2002లో చనిపోయేదాకా స్వాతంత్య్ర సమర యోధుడి పెన్షన్ తీసుకొన్నారు. నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మాది. బీజేపీలో ఉన్న ఏ ఒక్కరికైనా ఆ చరిత్ర ఉన్నదా? తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక్కరోజైనా లాఠీదెబ్బ తిన్నారా? ఒక్క రోజైనా జైలుకు వెళ్లారా?’ అని సూటిగా ప్రశ్నించారు.