హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంత్రి కేటీఆర్ ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మినీ శిల్పారామం వద్ద రూ.10 కోట్లతో హెచ్ఎండీఏ నిధులతో చేపట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను, ఉప్పల్ చౌరస్తాలో రూ.25 కోట్లతో హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్ను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ను జైల్లో పెడతామని అంటున్నరు. ఎందుకు? 12 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందించినందుకా? 13 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చినందుకా?డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్నందుకా? ఐటీ సంస్థలు తీసుకొస్తున్నందుకా? కేసీఆర్ను ఎందుకు జైలుకు పంపుతవ్?’ అని నడ్డాను నిలదీశారు. మాట్లాడటానికి ఓ హద్దు, అదుపు ఉండాలని, కేసీఆర్తో పెట్టుకున్న ఏ ఒక్కరూ రాజకీయంగా బాగుపడిన చరిత్ర లేదని మండిపడ్డారు. నడ్డా కానీ, ఇక్కడ ఉన్న తీన్ఫుట్ నేతలు కానీ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవినీతిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడితే.. పులి శాఖాహారం, హంతకుడు సంతాపం తెలిపినట్టు ఉంటుందని ఎద్దేవా చేశారు. రూ.50 లక్షల నోట్ల కట్టలతో దొరికి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నీతి ముచ్చట్లను మనం వినాలా? అని ప్రశ్నిం చారు. అమరులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కార్చుతున్నదని, చంపినోడే వచ్చి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు. 14 ఏండ్లు తెలంగాణ ఇవ్వకుండా అమరులను చంపింది సోనియాగాంధీ కాదా? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్తోనే ప్రగతి పరుగులు
తొమ్మిదేండ్లలో ఒక్కో పని చేసుకుంటూ హైదరాబాద్, తెలంగాణను అభివృద్ధి చేసుకొంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. 55 ఏండ్లలో కాంగ్రెస్ దరిద్రాన్ని 9 ఏండ్లలోనే కడిగామని, ప్రగతి రథ చక్రాలు ఆగొద్దంటే సీఎం కేసీఆర్ను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. సీఎం కేసీఆర్ లాంటి ధీశాలి, దమ్మున్న లీడర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అల్లాటప్పా నాయకులతో కాదని తెలిపారు. ఢిల్లీ గులాంలు మనకు అక్కరలేదని, స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
కేసీఆర్, మోదీ పనితీరుకు ఫై ్లఓవర్లే నిదర్శనం
హైదరాబాద్ నలువైపులా రహదారి వ్యవస్థను పటిష్టం చేశామని, ఐదేండ్లలోనే 35 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంబర్పేట, ఉప్పల్ నుంచి నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణంలో కేంద్రం నిర్లక్ష్యం కనిపిస్తున్నదని, జాతీయ రహదారిలో తామే చేస్తామంటూ ఫోజు కొట్టి ముందుకు వచ్చారని, కానీ.. నాలుగేండ్లుగా ప్రజలను చావగొడుతున్నారని మోదీ సర్కారుపై మండిపడ్డారు. ఈ రెండు సందర్భాలే కేసీఆర్, మోదీ పనితీరు వేగానికి నిదర్శనమని వెల్లడించారు. నడ్డా, కిషన్రెడ్డి ఫ్లైఓవర్ నిర్మాణ జాప్యంపై మాట్లాడాలని సవాల్ విసిరారు.
95 శాతం సమస్యలను తీర్చాం
హైదరాబాద్లో 95% సమస్యలు తీర్చామని కేటీఆర్ చెప్పారు. పెరుగుతున్న కాలనీలు, అపార్ట్మెంట్లకు తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,084 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించామని, కొల్లూరులో 4 వేల మందికి అలాట్ చేసినట్టు గుర్తుచేశారు. త్వరలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఈ నియోజకవర్గంలో రూ.88 కోట్లతో స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ను రామంతాపూర్ పెద్ద చెరువు నుంచి హబ్సిగూడ వరకు నిర్మించామని అన్నారు. రూ.270 కోట్లతో రహదారులను నిర్మించామని చెప్పారు. జీవో నంబర్ 58 కింద 9,883 మంది పేదలకు 3 దశల్లో ఇండ్ల పట్టాలను అందజేశామని, జీవో 59 కింద 1,461 ఇండ్ల పట్టాలను ఇచ్చామని వివరించారు.
ఉప్పల్, నాచారం, కుషాయిగూడ, చర్లపల్లి, మల్లాపూర్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో నిరంతర విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలోని 10 డివిజన్లలో స్థలాలను గుర్తిస్తే పేదలకు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం మొ త్తం కేసీఆర్ లాంటి నాయకుడిని కోరుకుంటున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్కైవాక్పై హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను, స్కైవాక్ మాడల్ను మంత్రి కేటీఆర్ తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండారు లక్ష్మారెడ్డి, మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిదేండ్లలో సంపూర్ణ అభివృద్ధి
తొమ్మిదేండ్లలో తెలంగాణ సంపూర్ణ అభివృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ ఎగుమతిలో రాష్ట్రం దూసుకుపోతున్నదని చెప్పారు. అబుదాబికి చెందిన లూలూ గ్రూపు రూ.3,500 కోట్ల పెట్టుబడిని ప్రకటించిందని, ఫ్రెంచ్ డిజిటల్ సర్వీస్ కంపెనీ ఉప్పల్, ఘట్కేసర్లో 3 వేల మందితో తమ కేంద్ర కార్యాలయాలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నదని వివరించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నందునే పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పచ్చదనాన్ని 7.7 శాతం పెంచటం ద్వారా హైదరాబాద్కు గ్రీన్ వరల్డ్ సిటీగా గుర్తింపు దక్కిందని అన్నారు.