హైదరాబాద్ : నగరంలోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులను రాష్ట్ర ఐటీ, పురపాలక సంఘం మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభినందించారు. నిమ్స్ ఆసుపత్రిలో నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయగా మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘వాట్ ఏ బ్యూటీఫుల్ న్యూస్. హైదరాబాద్లోని నిమ్స్ వైద్యులు 24 గంటల్లో 4 కిడ్నీ మార్పిడి చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు అద్భుతమైన సేవలను అందిస్తున్నాయి. సిబ్బంది అందరికీ నా అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. నిన్న 24 గంటల్లో నిమ్స్ వైద్యులు రికార్డు స్థాయిలో నాలుగు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేశారు. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం కింద పేద రోగులకు ఉచితంగా నిర్వహించారు. గత నాలుగైదు సంవత్సరాల నుంచి డయాలసిస్ చికిత్స పొందుతున్న బాధితులకు బ్రెయిన్ డెడ్ అయిన ముగ్గురు రోగుల నుంచి కిడ్నీలను మార్పిడి చేశారు.
ఒకరేమో బతికుండగానే కిడ్నీని దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నాలుగు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయగా.. విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. యూరాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ రాంరెడ్డి, ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో వైద్యులు విద్యాసాగర్, రామచంద్రయ్య, రఘువీర్, చరణ్ కుమార్, ధీరజ్, వినయ్, సునీల్, అరుణ్, జానకి, విష్ణు, పవన్, హర్ష, సూరజ్, పూవరసన్, అనంత్, షారూక్, అనస్థీషియా వైద్యులు పద్మజా, నిర్మల, ఇందిరా, గీత బృందం శస్త్ర చికిత్సలు నిర్వహించింది.
What a beautiful news 👍
Doctors at NIMS, Hyderabad have performed 4 kidney transplantations within 24 hours
Telangana Govt hospitals have been delivering terrific valued services to the patients. My compliments to all the staff pic.twitter.com/UF0tIKXPAz
— KTR (@KTRTRS) December 22, 2022