Mrunal Thakur | ఆధునిక సమాజంలో శరీరాకృతి, వర్ణం ఆధారంగా కనబరిచే వివక్షను అంతం చేయాలని కోరింది అగ్ర కథానాయిక మృణాల్ ఠాకూర్. బాడీషేమింగ్ (శరీరాకృతిని అవహేళన చేయడం) అత్యంత హేయమైన చర్య అని ఆమె అభిప్రాయపడింది. అందం, వర్ణం వంటి విషయాలతో సంబంధం లేకుండా మంచి గుణం ఆధారంగానే వ్యక్తులకు విలువనివ్వాలని చెప్పింది. సీతారామం, హాయ్ నాన్న వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ మరాఠి సుందరి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలను దక్కించుకుంటున్నది.
ఈ నేపథ్యంలో సోషల్మీడియా ఇన్ప్లూయెన్సర్, నటి డాలీసింగ్కు మద్దతుగా మృణాల్ ఠాకూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలపై సోషల్మీడియాలో ప్రశంసలొస్తున్నాయి. శారీరక ఆకృతిలో క్రమంగా చోటు చేసుకునే హెచ్చుతగ్గుల వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని డాలీసింగ్ సోషల్మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆమెకు మద్దతుగా నిలిచింది మృణాల్ ఠాకూర్. ‘శరీరాకృతిపై చేసే అవహేళన క్షమించరానిది. ఈ విషయంలో ప్రజల ఆలోచనా ధోరణి మారాలి. శరీరం గురించి కాదు మంచి మనసు గురించి మాత్రమే ఆలోచించాలి’ అని మృణాల్ ఠాకూర్ పేర్కొంది.