RBI | ముంబై, మే 20: ఎండల తీవ్రత, కుండపోత వర్షాలు సాధారణ ప్రజానీకానికే కాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కూ అసౌకర్యంగానే ఉంటాయి. ఆర్బీఐని అత్యంత ప్రభావితం చేసే అంశాల్లో వాతావరణం ఎప్పటికీ ముందు వరుసలో ఉంటుందన్నది మీకు తెలుసా మరి? అవును.. ఆర్బీఐ నిర్ణయాల్లో కీలకమైన వడ్డీరేట్ల సవరింపులు వాతావరణ పరిస్థితుల ఆధారంగానే ఉంటాయి. రెండు నెలలకోసారి జరుపుతున్న ద్రవ్యవిధాన పరపతి సమీక్షల్లో వెదర్ రిపోర్టుదే ప్రధాన పాత్ర. ఇంకా గట్టిగా చెప్పాలంటే యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతే వాతావరణంపై ఆధారపడి ఉంటుందన్నా అతిశయోక్తి కాదు.
భారత్.. ఇప్పటికీ వర్షాధార పంటల దేశమే. ఇక ఆర్బీఐ ద్రవ్యవిధానం.. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యాల (4 శాతం)కు అనుగుణంగా సాగుతుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా, వర్షాలు సమృద్ధిగా కురవకపోయినా లేదా అతిగా కురిసినా.. పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఇదే జరిగితే మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా లేక ద్రవ్యోల్బణం పెచ్చుమీరుతుంది. అప్పుడు దాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ.. రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను పెంచుతుంది. దీనివల్ల బ్యాంకుల రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి. ఇది సగటు మనిషి నుంచి, భారీ సంస్థలు, పరిశ్రమలదాకా ఎంతటి ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వచ్చే నెల జరుగబోయే ద్రవ్యసమీక్షలోనూ రెపోరేటును ఆర్బీఐ యథాతథంగానే ఉంచుతుందన్న అంచనాలున్నాయి. ఏడాదికిపైగా కాలం నుంచి రెపోరేటును ఆర్బీఐ 6.5 శాతం వద్దే ఉంచుతున్నది. అయితే ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిస్తే దీన్ని తగ్గించే వీలుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల ప్రభావం కూడా ఉన్నప్పటికీ.. వాతావరణం బాగుంటే మాత్రం ఆ అంశానికి ఆర్బీఐ ఈ దఫా అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చని అంటున్నారు. మొత్తానికి వాతావరణం ఆశించినట్టుగా ఉంటే రుణభారం తగ్గొచ్చని చెప్పవచ్చు.