వివిధ పార్టీలతో ఫ్రంట్లు ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం లేదు. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైంది. ఫ్రంట్ల ఏర్పాటు కోసం కేసీఆర్ ఒక ప్రయత్నం చేశారు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతనే బీఆర్ఎస్ను ఏర్పాటు చేశాం. తెలంగాణ మాడల్ను దేశం ముందు ఉంచి ఓట్లు అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలను ఏకం చేయదు. ప్రజలను ఏకం చేస్తుంది.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి మూడోసారి సీఎం అభ్యర్థి ముమ్మాటికీ కేసీఆరేనని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థి ఎవరో చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బీఆర్ఎస్సేనని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టంచేశారు. దక్షిణాదిలో వరుసగా తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న అరుదైన రికార్డు సాధించిన కేసీఆర్కు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తూ అనేక విషయాలను పంచుకున్నారు.
‘20 ఏండ్ల క్రితం ఏర్పడ్డ ఛత్తీస్గఢ్లో ఒక్క అసెంబ్లీని కట్టుకునేందుకు వాళ్లకు 20 ఏండ్లు పట్టిందని, తెలంగాణాలో సచివాలయాన్ని రికార్డు సమయంలో 26 నెలల్లోనే పూర్తి చేయగలిగామని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్క సచివాలయం నిర్మాణమే కాదు.. కొత్త గ్రామాలు, కొత్త మండలాలు, కొత్త జిల్లాలు.. ఇలా అనేక పరిపాలనా సంస్కరణలను కూడా తెలంగాణ గొప్పగా అమలు చేసిందని వివరించారు. కాంగ్రెస్ 55 ఏండ్లలో చేసినదాన్ని తెలంగాణ తొమ్మిదేండ్లలోనే చేయగలిగిందని తెలిపారు.
హెచ్వోడీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ట్విన్ టవర్స్ కట్టాలని నిర్ణయిస్తే.. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక రాష్ట్ర ప్రభుత్వం 279 ఎకరాలు అమ్మబోతున్నదని, భూ కుంభకోణం అంటూ రాసిందని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. ప్రభుత్వం ఒకవేళ భూమి అమ్మితే వచ్చే సొమ్ము ప్రభుత్వ ఖాతాలోకే వెళ్తుందని, భూమి రూపంలో ఉన్న ప్రభుత్వ ఆస్తి నగదు రూపంలోకి మారుతుందని చెప్పారు. భూమి రూపంలో ఉన్నా, నగదు రూపంలోకి మారినా అది పూర్తిగా ప్రజల సంపదగా, ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుందని, ప్రజలకే చెందుతుందనే విషయయాన్ని ఆంధ్రజ్యోతి గమనించాలని హితవు చెప్పారు.
గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొని గవర్నర్కు పంపిస్తామని కేటీఆర్ వెల్లడించారు. అభ్యర్థులపై పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని, ఇప్పటివరకు ఎవరికి ఇస్తారన్నదానిపై చర్చ జరగలేదని తెలిపారు.
రాహుల్గాంధీ ఎన్జీవో (స్వచ్ఛందసంస్థ) పెట్టుకుంటే మంచిదని మంత్రి కేటీఆర్ చురకలేశారు. రాహుల్గాంధీ నఫ్రత్ కే దుకాణ్ అంటూ మాట్లాడుతున్నారని, రాజకీయాల్లో దుకాణాలు, దందాల గురించి మాట్లాడటం వృథా అని చెప్పారు. ప్రజలకు ఏమి చేస్తామో చెప్పాలని, ఎన్నికలు వచ్చినపుడు కొట్లాడాలని, కొట్లాడకుండా పారిపోయేవాడు దుకాణాలంటూ డైలాగ్లు చెప్పడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు.
సిలిండర్ ధర 400 ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ సర్కార్ను దించాలని, సిలిండర్కు దండం పెట్టి ఓటు వేయాలని నాడు మోదీ పిలుపునిచ్చారని ఇప్పుడు తాము కూడా అదే చెప్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1,200కు పెంచిన మోదీకి ఓటేయవద్దని ప్రజలకు, మహిళలకు గుర్తు చేస్తామని తెలిపారు. దేశంలో కొత్తగా ఏదైనా పార్టీ వచ్చి ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను తీరుస్తుందనుకుంటే పార్టీకి తప్పకుండా ఓటేస్తారని, దీనికి తెలంగాణాలో 2014లో జరిగిన ఎన్నికలే ఒక ఉదాహరణ అని చెప్పారు. 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల తీరును గమనిస్తే.. ప్రజలు తమకు నచ్చని వ్యక్తికి, పార్టీకి ఓటేయలేదని విశ్లేషించారు. మోదీ అత్యంత అసమర్థ ప్రధాని అని, ఆయనను ప్రజలు ఇంటికి పంపుతారని స్పష్టంచేశారు. మనది ఉల్లిగడ్డ ధర పెరిగితే ప్రభుత్వాన్ని పడగొట్టిన దేశమని గుర్తు చేశారు. ఇప్పుడు పెరుగుతున్న ధరలపై ప్రజలు విచక్షణతో ఆలోచిస్తారని, ధరల పెరుగుదలకు కారణమైన బీజేపీని ఇంటికి పంపేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎన్నుకుంటారన్నది చూడాలని పేర్కొన్నారు.
దేశానికి కావాల్సింది విద్వేషం, విభజన కాదని, మంచి విధానాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల కోసం ఏమి చేద్దామనే అంశంపై పార్టీలు చర్చించుకోవాలని, కలవాలని ఆకాంక్షించారు. కేవలం ఒక వ్యక్తిని గద్దె దించడం, మరో వ్యక్తిని గద్దెనెక్కించడం ఎజెండాగా ఉండరాదని స్పష్టంచేశారు. మోదీని గద్దె దించడమే ఎజెండా కాకూడదని, దేశ ప్రజల ముందు ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను పెట్టాలని సూచించారు.
ఎవరికి అధికారం ఇవ్వాలన్న దానిపై ప్రజలకు స్పష్టత ఉంటుందని, ఓట్లలో చీలిక ఉండదని కేటీఆర్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో ఉపఎన్నికల్లో బీజేపీకి మూడోస్థానం వస్తే.. మునుగోడులో కాంగ్రెస్కు మూడోస్థానం వచ్చిందని ఉదహరించారు. స్థానిక పరిస్థితులను చూసి ప్రజలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
కాంగ్రెస్ సక్కగ ఉంటే దేశంలో ఈ పరిస్థితే ఉండేది కాదు. వాళ్లు సక్కగ లేకపోవడంతోనే ఈ సమస్యలు. యుద్ధం జరుగుతున్నపుడు అస్త్ర సన్యాసం చేసేవాడిని వీరుడు, శూరుడు అంటారా? గుజరాత్లో ఎన్నికలు జరుగుతుంటే.. రాహుల్గాంధీ ఆ రాష్ర్టానికి వెళ్లకుండా జోడోయాత్ర చేపట్టారు. గుజరాత్ ఎందుకు వెళ్లలేదు? ప్రధానమంత్రి వద్దన్నారా?
– మంత్రి కేటీఆర్
తాను విదేశీ పర్యటనకు వెళ్లినపుడు అక్కడి వారి నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. గత తొమ్మిదేండ్లలో తెలంగాణ, హైదరాబాద్ ఎదిగిన తీరు, ఇక్కడ జరిగిన కృషిని ప్రపంచం గమనిస్తున్నదని చెప్పారు. భారతదేశంలోని ఉత్తమ నగరంగా హైదరాబాద్ను కీర్తిస్తున్నారని తెలిపారు. యూకేలోని ఒక పెద్ద గ్రూప్ను కలిసినప్పుడు మీరు తొలుత ఢిల్లీ, ముంబై.. తదితర నగరాలను చూసిన తరువాత హైదరాబాద్ రావాలని తాను చెప్తే.. తమకు అంతా తెలుసునని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్లో విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయని వారు చెప్పినప్పుడు సంతోషం వేసిందని,. నిజంగా అబ్బురపడే సన్నివేశమని పేర్కొన్నారు.
ఔటర్రింగ్రోడ్డు కుంభకోణం అంటూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు సీరియస్గా తీసుకోవడంలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో పారదర్శక విధానాలు అవలంభించామని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఆరోపణల నేపథ్యంలో ప్రజల ముందు వాస్తవాలు ఉంచామని, ఈడీ, సీబీఐ ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ ప్రకటించామని గుర్తుచేశారు. అయినా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో హెచ్ఎండీఏ ద్వారా లీగల్ నోటీసులు ఇచ్చారని చెప్పారు. టెండర్లు దక్కించుకున్న కంపెనీ రఘునందన్రావుకు లీగల్ నోటీసు ఇచ్చిందని తెలిపారు. వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టులో సమర్పించవచ్చునని పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరంగానే ముందుకెళ్తామని స్పష్టంచేశారు. బండి సంజయ్, రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ర్టానికి సరిపోరని, వారు ప్రధానమంత్రి అభ్యర్థులుగా ఉండాలని ఎద్దేవా చేశారు.
ఇప్పటివరకు పనిచేసిన ప్రధానమంత్రుల్లో సమర్థులెవరని మీడియా ప్రతినిధులు మంత్రి కేటీఆర్ను ప్రశ్నించగా దేశాన్ని నవ్య పథంలో నడిపించిన పీవీ నరసింహారావు బెస్ట్ ప్రధానమంత్రి అని చెప్పారు. దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాలను పీవీ తీసుకొచ్చారని, ఇప్పుడు దేశంలో కనిపిస్తున్న అనేక సంస్కరణలకు ఆయన ఆద్యుడని కితాబిచ్చారు. ఈ రోజు సెల్ఫోన్ను వాడుతున్నామంటే పీవీయే కారణమని గుర్తుచేశారు. దేశాన్ని నవ్యపథంలో నడిపిన పీవీకి సరైన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ కూడా పీవీని గౌరవించలేదని, కనీసం ఢిల్లీలో స్మారకాన్ని కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగ మార్చ్ల పేరుతో రాజకీయ హడావుడి చేస్తుంటే.. తాము ఉద్యోగాల కోసం పెట్టుబడుల వెల్లువ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నామని, చేతల ద్వారా సమాధానం చెప్తున్నామని అన్నారు. తాను తాజాగా చేపట్టిన యూకే, యూఎస్ పర్యటనల ద్వారా 42 వేల ఉద్యోగాలు కొత్తగా రాష్ర్టానికి రాబోతున్నాయని వివరించారు. లెక్కలతో సహా చెప్తానని స్పష్టంచేశారు. ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం? వాటి వల్ల వచ్చే పెట్టుబడుల విలువ ఎంత? ఎన్ని ఉద్యోగాలు, ఎంత కాలంలోపు వస్తాయి? తదితర అంశాలను ప్రకటించామని చెప్పారు. తెలంగాణాలో ఉద్యోగాలు చేద్దామనుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేశారు. నైపుణ్యాలు పెంచుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయని, అద్భుతంగా ఉద్యోగాలను సృష్టించామని చెప్పారు.