KTR | ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జాబ్ క్యాలెండర్పై దృష్టి పెడుతామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడు దుస్థితికి కారణమైన కాంగ్రెస్పై మండిపడ్డారు. 60 ఏళ్ల పాటు మనుగోడు ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది ఎవరి ప్రశ్నించారు.
గతంలో ఆ పార్టీకి 11 ఛాన్స్లు ఇచ్చినా ఏం చేశారంటూ మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు మూడు గంటలు పొలాలకు కరెంట్ చాలని చెబుతున్నాడని.. మరి మూడు గంటలు కరెంట్ సరిపోతుందో.. లేదో చెప్పాల్సింది ప్రజలేనన్నారు. కరెంటు కావాలో.. కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్ను రూ.5వేలకు పెంచుతామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18ఏళ్లు నిండిన మహిళలకు రూ.3వేలు అందించనున్నట్లు తెలిపారు. అలాగే అసైన్డ్ భూముల ఉన్న వారికి యాజమాన్య హక్కులు కల్పించనున్నట్లు చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీజేపీ సిద్ధాంతాలను కాంగ్రెస్లో అమలు చేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఒక్కసారి సైతం విమర్శించలేదన్నారు. కాంగ్రెస్ హవా అనేది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రమేనంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ 80 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో మైనారిటీలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చాలా చేసిందని, వారి మద్దతు తమకే కుంటుందని పేర్కొన్నారు. రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీని రెండుసార్లు కోరామని కేసీఆర్ పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్కు లేని అడ్డంకి రైతుబంధుకు ఎందుకు అంటూ ప్రశ్నించారు.