Minister KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ వివరంగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో మతాల పంచాయతీ లేదు, కులాల మధ్య కొట్లాట లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఉండటం వల్లే అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. దేశంలో ఉన్న ఐటీ పురోగతితో పోలిస్తే.. మన ఐటీ పురోగతి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్షిప్ వల్లే ఇదంతా సాధ్యం అయిందని విజ్ఞప్తి చేస్తున్నాను. గురుగ్రామ్లో ఐటీ పరిశ్రమను నాశనం చేస్తున్నారు. మణిపూర్లో తెగల మధ్య కొట్లాట పెట్టారు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని బేగంపేటలో 1987లో మొట్టమొదట ఐటీ టవర్ వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు.. 27 సంవత్సరాల్లో ఐటీ రంగాల్లో రూ. 56 వేల కోట్లు ఐటీ ఎగుమతులు మాత్రమే. కానీ గతేడాది తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో రూ. 57,707 ఐటీ ఎగుమతులు సాధించింది. ఇది సమర్థత గల ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయి. కొత్త రాష్ట్రం వచ్చాక 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా నగరాల్లో ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశంలో మొత్తం సృష్టించిన టెక్నాలజీ జాబ్స్లో 44 శాతం తెలంగాణవే అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఇవాళ ఎకరం ధర రూ. 100 కోట్లు పలుకుతోంది అని కేటీఆర్ గుర్తు చేశారు.