KTR | హైదరాబాద్ : తెలంగాణలో సంక్షేమమే తప్ప.. సంక్షోభం లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం కేటీఆర్ వివరణ ఇచ్చారు.
9 ఏండ్లుగా తెలంగాణ అభివృద్ధికి నిర్మాణాత్మకంగా పని చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక వైపు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మరో వైపు మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు చేస్తున్నాం. బడ్జెట్ పెట్టుబడి వ్యయంలో తెలంగాణే ముందుంది. బడ్జెట్లో పెట్టుబడి వ్యయం ఛత్తీస్గఢ్లో 15 శాతం, రాజస్థాన్లో 16 శాతం మాత్రమే ఉంది. తెలంగాణలో మాత్రం 26 శాతం పెట్టుబడి వ్యయంగా పెడుతున్నాం. నేను చెప్పేది తప్పుంటే వచ్చే ఎన్నికల్లో ఓడించండి అని కేటీఆర్ సవాల్ చేశారు.
రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమ ఖర్చుల లెక్క మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్కు బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రజల జీవనరేఖ. తెలంగాణ నమూనా.. అంటే సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి. మౌలిక వసతుల కల్పనలో గ్రామాలు, పట్టణాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నాం. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం దూసుకుపోతున్నాయి. తెలంగాణలో సంక్షేమమే తప్ప.. సంక్షోభం లేదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో తెలంగాణలో పల్లె మురిసింది.. పట్టణం మెరిసింది. పల్లెల్లో హార్వస్టర్లు, పట్టణంలో ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారు. 9 ఏండ్ల క్రితం రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉండే. కాంగ్రెస్ పాలన ఎంత చెత్తగా ఉండేదో ఆనాడే సభలో రేవంత్ రెడ్డి చెప్పిండు అని కేటీఆర్ గుర్తు చేశారు.
నీళ్ల కోసం రోజుకొక ట్యాంకర్ తెచ్చుకుంటున్నామన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలు అవాస్తవం అని కేటీఆర్ స్పష్టం చేశారు. 2022 జనవరి నుంచి భట్టి ఒక్క ట్యాంకర్ కూడా బుక్ చేయలేదు. భట్టి ఉంటున్న ఇంట్లో మంచినీటి మీటర్ చెడిపోయింది. మీటర్ చెడిపోవడం వల్లే రూ. 2.90 లక్షల నీటి బిల్లు చెల్లించాల్సి వచ్చింది. మీటర్ పని చేసి ఉంటే.. భట్టి ఇంటికి కూడా ఉచిత మంచినీటి పథకం వర్తించేది. నగరంలో ప్రతి ఒక్కరికి 20 వేల లీటర్ల వరకు మంచినీరు ఉచితంగా ఇస్తున్నాం అని తెలిపారు.