KTR | సిద్దిపేట : హుస్నాబాద్ ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం. కరువు ఉన్న ప్రాంతం. నెర్రెలు బారిన నేలలు, నెత్తురు కారిన నేలలు ఇవి.. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కరువును తరిమేసామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రైతు సంక్షేమ పథకాలు అనేకం అమలవుతున్నాయి. కేసీఆర్ కాళేశ్వరం నీళ్లను పైకి మళ్లిస్తున్నాడు అపర భగీరథుడిలా. ఈ ప్రాంతంలో శాశ్వతంగా కరువును తరిమేసాం. కాళేశ్వరం నీళ్లు.. కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, మిడ్ మానేరు వరకు నీళ్లు వస్తున్నాయి. మొత్తంగా ఈ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలంగా ఉందన్నారు కేటీఆర్. ఒక ప్రాజెక్టుకు కొబ్బరి కాయ కొడితే.. అది పూర్తయ్యే నమ్మకం లేకుండే. కాలువలు తవ్వుతూనే ఉన్నారు. కానీ నీళ్లు రాలేదు. కేసీఆర్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రాజెక్టులు పూర్తి చేసి, గోదావరి నీళ్లను మీ పాదాల వద్దకు తీసుకొచ్చారని కేటీఆర్ తెలిపారు. ఒకప్పుడు కరెంట్ కోసం గోస పడ్డాం. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 9 గంటల కరెంట్ అని నరికి 6 గంటల కరెంట్ ఇచ్చారు. అది కూడా సక్కగా ఇవ్వని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ వస్తే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవాళ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశామని కేటీఆర్ తెలిపారు. అక్కడకు వచ్చిన ఆడబిడ్డలను నీళ్లు వస్తున్నాయా? అని అడిగాను. బంజారాహిల్స్లో ఎలాగైతే నీల్లు వస్తున్నాయో.. మా బంజారా తండాల్లో కూడా అలాగే నీళ్లు వస్తున్నాయని చెప్పారు. మా తండాల్లో మా రాజ్యం తీసుకొచ్చారు. హుస్నాబాద్లో 11 తండాలను గ్రామపంచాయతీలు చేశారని ఆ ఆడబిడ్డలు చెప్పారని కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాక ముందు ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు గ్రామాల్లోకి వచ్చేందుకు భయపడేవారు. ఇవాళ మాత్రం ప్రతి ప్రజాప్రతినిధి గ్రామాల్లోకి వస్తున్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా 75 ఏండ్ల తర్వాత కేసీఆర్ ఆడబిడ్డల కష్టాలను తీర్చారు. ఇంటింటికీ మంచినీళ్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు కేటీఆర్.
హుస్నాబాద్ నియోజకవర్గంలో లక్షా 6 వేల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చిన ఎమ్మెల్యే సతీశ్ కుమార్ను ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ ప్రజలను కోరారు. గోదావరి నీళ్లు తెచ్చి మీ పాదాలు కడిగినందుకు ఆయనన భారీ మెజార్టీతో గెలిపించాలి. హుస్నాబాద్లో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తాం. 25 కోట్లు హుస్నాబాద్కు మంజూరు చేస్తున్నాం. కొత్తపల్లి – జనగామ వెళ్లే రోడ్డును విస్తరించి, అభివృద్ధి చేస్తాం. బ్యాడ్మింటన్ కోర్టు కలను నెరవేర్చాం. సతీశ్ కుమార్ ఒక పని మొదలు పెడితే వదిలిపెట్టరు అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరినప్పుడే.. కేంద్రంలో మోదీ కూడా కొలువుదీరాడు. నాడు అధికారంలోకి వచ్చే ముందు మోదీ పెద్ద పెద్ద మాటలు చెప్పి, పెద్ద నోట్లు రద్దు చేసి.. అందర్నీ ఆగం చేసిండు. సిలిండర్ ధరల విషయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ను ఇదే మోదీ తిట్టిండు. ఇప్పుడేమో సిలిండర్ ధరను రూ. 1200కు పెంచిండు. నూనె, పప్పు, ఉప్ప ధర పెరిగింది. రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్నాడు. కానీ ఆదాయం పెరగలేదు. నల్ల చట్టాలతో రైతుల ఉసురు పోసుకున్నాడని మోదీపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
ప్రస్తుతం ఎంపీ వ్యవహారంతో కరీంనగర్ ప్రజలు సిగ్గు తలదించుకుంటున్నారు. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మోదీ దేవుడని అంటున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన మోదీ దేవుడా..? రైతుల కష్టాలు, సిలిండర్ ధరలు పెంచినోడు దేవుడా..? దయచేసి ఆలోచించింది. ఇలాంటి పిచ్చోళ్లను పార్లమెంట్కు పంపితే జరిగే నష్టం ఇదే. నాలుగున్నరేండ్లలో ఈ ఎంపీ నియోజకవర్గానికి ఒక్క పైసా పని చేసిండా..? పిల్లలను రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదు. ఒక బడి, గుడి, యూనివర్సిటీ కట్టిండా..? అభివృద్ధికి పునాదులు తవ్వాలి. కానీ హింసకు కాదన్నారు. ఎమ్మెల్యే సతీశ్తో పాటు ఎంపీ అభ్యర్థి వినోద్ను భారీ మెజార్టీతో గెలిపించాలి అని కేటీఆర్ కోరారు.
కాంగ్రెస్ నాయకులను చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు అని కేటీఆర్ ఎద్దెవా చేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఒకటి కాదు.. 10 సార్లు అవకాశం ఇచ్చాం. కరెంట్, తాగు, సాగు నీరు ఇవ్వలేదు. కులవృత్తులను సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెళ్లిపోయారు. ప్రజలు మీ పాలనను మరిచిపోలేదు. గోదావరి నీళ్లు తెస్తా.. లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితే కాదు.. భారత రైతు సమితి అని కేటీఆర్ వివరించారు.