హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు త్వరలో మంచి రోజులు రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు (డిసెంబర్ 4న) ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని అశోక్నగర్లో నిరుద్యోగ యువతతో ప్రత్యేకంగా సమావేశమవుతానని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అన్ని సమస్యలపై కూలంకషంగా చర్చిస్తానని హామీ ఇచ్చారు.
అశోక్నగర్తోపాటు వివిధ యూనివర్సిటీల్లో ఉంటూ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న పలువురు విద్యార్థులు, నిరుద్యోగులు సోమవారం ఆయనను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు అంశాలపై వారితో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, ముఖ్యంగా సంవత్సరానికి కనీసం 1,000 ఉద్యోగాలైనా కల్పించలేని కాంగ్రెస్ పార్టీకి అసలే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యువతకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన తాము అంతకు రెట్టింపు స్థాయిలో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
ఇందులో ఇప్పటికే 1.62 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను గణాంకాలతో సహా వివరించారు. గత పదేండ్లలో తెలంగాణ కంటే అధికంగా ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదన్న వాస్తవాలను యువత తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ నేతలు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారికి దమ్ముంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గత పదేండ్లలో యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని సవాలు విసిరారు.
మంత్రి కేటీఆర్ మాటలు సంతోషకరం
ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు సంతోషాన్ని కలిగించాయని ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సాంకేతిక సమస్యలతో యువతలో కొంత ఆందోళన నెలకొన్నదని తెలిపారు. ఈ అంశాలపై మంత్రి కేటీఆర్తో తమ అభిప్రాయాల ను, సూచనలను పంచుకోవడంతోపాటు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాల సంఖ్యను మరింత పెంచాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.
ప్రైవేట్ ఉద్యోగిగా పదేండ్లు పనిచేశా: కేటీఆర్
పదేండ్లు ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేసిన అనుభవం తనకు ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏ ఉద్యోగమైనా పూర్తిగా అర్థం చేసుకోగలనని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక సోదరుడిగా భరోసా ఇస్తున్నానని, విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న 60 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంతోపాటు గ్రూప్-2 పోస్టుల సంఖ్యను మరింత పెంచుతామని హామీ ఇచ్చారు.