కామారెడ్డి, జూలై 24 : నకిలీ పత్రాలతో భూమిని రిజిస్ట్రేషన్ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సిరిసిల్లా జిల్లా గంభీరావుపేటకు చెందిన ముక్తావరం శాంత తన భర్త ముక్తావరం వెంకటయ్య పేరుమీద కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలోని కాకతీయనగర్ కాలనీలో సుమారు 200 చదరపు గజాలు స్థలం ఉన్నది.
అయితే వారు ఈ స్థలాన్ని విక్రయించడానికి సిద్ధంకాగా, ఆ స్థలం ఇతరుల పేరుమీద ఉన్నట్లు తెలియడంతో కంగుతిన్నారు. వెంటనే దేవునిపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సాక్షుల వాంగ్మూలాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, సాంకేతిక ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడిగా రాజంపేట మండలం ఆరగొండ గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్ రెడ్డిగా గుర్తించారు.
బండారి శ్రీనివాస్ రెడ్డి తన అప్పులను తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ భూమిని స్వాధీనం చేసుకొని విక్రయించేందుకు కుట్ర పన్నినట్లు తేలింది. ఇందులో తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా, తాడ్వాయి మండలం ఎండ్రియల్ గ్రామానికి చెందిన తన మామా గున్ రెడ్డి సంగారెడ్డిని అసలు యజమాని ముక్తావరం వెంటయ్యగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో హాజరుపరిచి, నకిలీ గుర్తింపు పత్రాలు, తప్పుడు ఆధారాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ వివరించారు. నేరాన్ని అంగీకరించిన బండారి శ్రీనివాస్ రెడ్డి, బండారి సునీత, గున్రెడ్డి సంగారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. రూరల్ సీఐ శ్రీధర్గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్ పాల్గొన్నారు.